టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్.. తల గాయంతో ఆస్పత్రి పాలయ్యాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో లంక పేసర్ లాహిరు కుమార బౌలింగ్కు వచ్చాడు. అతను వేసిన షార్ట్పిచ్ బంతిని పుల్ చేయడానికి ఇషాన్ ప్రయత్నించాడు.
కానీ ఆ బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో అది అతని తలను బలంగా తాకింది. వెంటనే మైదానంలోకి వచ్చిన టీమిండియా ఫిజియో.. ఇషాన్ను పరిశీలించాడు. ఆ తర్వాత కాసేపటికే అతను అవుటై పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే తలలో కన్కషన్ అయ్యిందేమో చూడటానికి ఇషాన్ను స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
అంతేకాదు, శ్రీలంక వికెట్ కీపర్ దినేష్ చండిమాల్ కూడా బొటన వేలి గాయంలో అదే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇషాన్ గనుక ఆదివారం జరిగే మూడో టీ20లో ఆడలేకపోతే.. సంజు శాంసన్కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఓపెనర్గా మయాంక్ అగర్వాల్కు స్థానం దక్కొచ్చు. మణికట్టు గాయంతో ఈ సిరీస్కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో మయాంక్ను తీసుకున్న సంగతి తెలిసిందే.