సఫారీలతో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత జట్టు సిద్దం అవుతోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడేజా వంటి సీనియర్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. అయినా సరే భారత జట్టు ప్రమాదకరమైనదేనని సౌతాఫ్రికా సారధి టెంబా బవుమా అన్నాడు. ముఖ్యంగా భారత జట్టులోకి దూసుకొచ్చిన యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ గురించి బవుమా మాట్లాడాడు.
ఏ బ్యాటర్ కూడా 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవాలని కోరుకోడని చెప్పాడీ సఫారీ బ్యాటర్. అయితే తమ జట్టులో కూడా అంత వేగంతో బంతులు వేసే వాళ్లు ఉన్నారని ధీమా వ్యక్తం చేశాడు. ‘‘సౌతాఫ్రికాలో మేమంతా పేసర్లను ఎదుర్కొంటూనే పెరుగుతాం. కానీ నాకు తెలిసి ఏ బ్యాటర్ కూడా 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులు ఎదుర్కోవాలని అనుకోడు.
అయితే దానికి కూడా సిద్ధం అవడం తప్పనిసరి. మా దగ్గర కూడా అంత వేగంతో బౌలింగ్ చేసే వాళ్లు ఉన్నారు’’ అని చెప్పాడు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో ఉమ్రాన్ మాలిక్కు మంచి అరంగేట్రం లభించాలని బవుమా కోరుకున్నాడు. ఐపీఎల్లో ఆడినట్లే ఈ సిరీస్లో కూడా సత్తా చాటుతాడని భావిస్తున్నట్లు తెలిపాడు.