సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయింది. తొలి మ్యాచ్లో బౌలర్లు పూర్తిగా విఫలమవగా.. రెండో మ్యాచ్లో కొంత పోరాడినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మాజీలు చాలామంది రిషభ్ పంత్ నిర్ణయాలను తప్పుబడుతున్నారు.
ముఖ్యంగా బ్యాటింగ్ చేసే సమయంలో ఫామ్లో ఉన్న దినేష్ కార్తీక్ కన్నా ముందు అక్షర్ పటేల్ను ఎలా పంపుతారని అంతా అడుగుతున్నారు. కటక్లో జరిగిన రెండో టీ20లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. రుతురాజ్ గైక్వాడ్, పంత్, హార్దిక్ విఫలమయ్యారు. కాసేపు మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ కూడా అవుటయ్యాడు.
పంత్ కూడా పెవిలియన్ చేరిన తర్వాత దినేష్ కార్తీక్ వస్తాడని అంతా అనుకున్నారు. కానీ పంత్ మాత్రం ఇంకా సుమారు 7-8 ఓవర్లు ఉండటంతో అక్షర్ను పంపాడు. అతను కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా చివరి రెండు ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడటంతో భారత జట్టు 148 పరుగుల ఓ మాదిరి స్కోరు చేసింది.
అదే డీకే మరో రెండు ఓవర్లు ముందు వచ్చి ఉంటే మరింత భారత జట్టు మంచి స్కోరు చేసేది కదా? అని చాలా మంది వాదిస్తున్నారు. మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా అదే అన్నాడు. ఫినిషర్ అంటే 15వ ఓవర్ తర్వాతనే రావాలనే రూల్ లేదని, ఇంకొంచెం ముందు వస్తే కుదురుకునే వీలుంటుందని చెప్పాడు. డీకేను ముందు పంపాల్సిందంటూ పంత్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
సౌతాఫ్రికా గ్రేట్ గ్రేమ్ స్మిత్ కూడా అదే మాట చెప్పాడు. డీకే కన్నా ముందు అక్షర్ను పంపాలనే నిర్ణయం మైండ్ బ్లోయింగ్గా ఉందని, తను అసలు అది ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. డీకే కన్నా ముందు వచ్చిన అక్షర్ కూడా పూర్తిగా నిరాశ పరచడంతో భారత జట్టు గట్టి స్కోరు చేయలేకపోయింది. ఆ తర్వాత సౌతాఫ్రికా కీపర్ క్లాసెన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఆ జట్టు విజయం సాధించింది.