సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసి సిరీస్ పట్టేయాలని భావించిన టీమ్ఇండియాకు చుక్కెదురైంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదురైనా.. ఆ తర్వాత
విజృంభించి సిరీస్ సమం చేసిన పంత్ సేన ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. నిర్ణయాత్మక ఐదో టీ20లో నాలుగు ఓవర్లు కూడా పూర్తి కాకుండానే వర్షం దంచికొట్టింది. వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు.. మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా ఇరు జట్లు సిరీస్ పంచుకున్నాయి.
బెంగళూరు: నిర్ణయాత్మక ఐదో టీ20కి వర్షం అంతరాయం కలిగించడంతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ సమమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా.. మిగిలిర రెండు మ్యాచ్ల్లో భారత్ గెలుపొందింది. 2-2తో ఆదివారం మ్యాచ్కు సిద్ధమైన ఇరు జట్లతో వరుణుడు ట్వంటీ ట్వంటీ ఆడుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడానికి ముందు వరుసగా ఐదో మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్కు దిగింది.
వర్షం కారణంగా 50 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన పోరులో.. 3.3 ఓవర్లలో టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసిన సమయంలో మరోసారి వర్షం దంచికొట్టింది. ఇషాన్ కిషన్ (15; 2 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (10; 1 ఫోర్) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. సఫారీ బౌలర్లలో ఎంగ్డీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఏ దశలోనూ వరుణుడు శాంతించకపోవడంతో పలుమార్లు సమీక్షలు నిర్వహించిన అంపైర్లు చివరకు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్ల్లో పొదుపుగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టిన భారత పేసర్ భువనేశ్వర్ కుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డు దక్కింది.
మూడు రోజుల బ్రేక్..
నిర్విరామంగా మ్యాచ్లు ఆడుతున్న ప్లేయర్లకు బీసీసీఐ మూడు రోజుల విశ్రాంతి కల్పించింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఐర్లాండ్తో సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లు మూడు రోజుల బ్రేక్ తర్వాత ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో తిరిగి ముంబైలో కలుసుకోనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంగ్లండ్తో జరుగున్న ఏకైక టెస్టు కోసం కోచ్ ద్రవిడ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్.. సోమవారం లండన్ బయలు దేరనున్నారని బీసీసీఐ అధికారి తెలిపారు. మిగిలిన ఆటగాళ్లు శుక్రవారం ఐర్లాండ్కు ప్రయాణం కానున్నారు. ఈ నెల 26, 28 తేదీల్లో ఐర్లాండ్తో హార్దిక్ నాయకత్వంలోని టీమ్ఇండియా రెండు టీ20లు ఆడనుంది.