ఒక క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(732) చేసిన బ్యాటర్గా సూర్యకుమార్యాదవ్ నిలిచాడు.
పొట్టి ఫార్మాట్లో భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంతో ఊపుమీదున్న టీమ్ఇండియా..దక్షిణాఫ్రికా భరతం పట్టింది. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్పై యువ బౌలర్లు అర్ష్దీప్సింగ్, దీపక్చాహర్ సఫారీల భరతం పట్టారు.పదునైన స్వింగ్ బౌలింగ్తో వెన్నులో వణుకు పుట్టించారు. స్వింగ్ బౌలింగ్తో టపాటపా వికెట్లు పడగొట్టి దమ్మురేపారు. వీరిద్దరి ధాటికి దక్షిణాఫ్రికా ఒక దశలో తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆఖర్లో కేశవ్ మహారాజ్ ఆదుకోబట్టి సరిపోయింది..లేకపోతే పరువు అరేబియా సముద్రంలో కలిసేది. స్వల్ప లక్ష్యఛేదనలో రోహిత్, కోహ్లీ ఔటైనా రాహుల్, సూర్యకుమార్ అజేయ అర్ధసెంచరీలతో జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.
తిరువనంతపురం: ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్ ఇరుగదీస్తున్నది. అందుబాటులో ఉన్న మ్యాచ్లను సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళుతున్నది. మెగాటోర్నీకి ముందు లోపాలను సరిదిద్దుకుంటూ బలబలాలను బేరీజు వేసుకుంటున్నది. గత మ్యాచ్లకు భిన్నంగా బౌలర్లకు బాగా సహకరించిన బుధవారం నాటి మ్యాచ్లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. దీని ద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. సఫారీలు నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. మరో 20 బంతులు మిగిలుండగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. రబాడ(1/16), నోర్టె(1/32) ఒక్కో వికెట్ తీశారు. తొలుత అర్ష్దీప్సింగ్(3/32), దీపక్ చాహర్(2/24) ధాటికి దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 106/8 స్కోరుకు పరిమితమైంది. కేశవ్ మహారాజ్(41), మక్క్రామ్(25), పార్నెల్(24) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. సఫారీల నడ్డివిరిచిన అర్ష్దీప్సింగ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య వచ్చే నెల 2న గువాహటిలో రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది.
గ్రీన్ఫీల్డ్ స్టేడియం పేరుకు తగ్గట్టే..పిచ్ ఆకపచ్చ రంగు పులుముకున్నది. విదేశీ పిచ్లను తలపిస్తూ బౌలర్లకు స్వర్గధామంలా నిలిచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్శర్మ నమ్మకాన్ని నిలబెడుతూ ఆదిలోనే దీపక్ చాహర్, అర్ష్దీప్సింగ్ నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ను కకావికలు చేశారు. కెప్టెన్ బవుమా(0) క్లీన్బౌల్డ్తో మొదలైన సఫారీల వికెట్ల పతనం దిగ్విజయంగా కొనసాగింది. అప్పటి వరకు ఔట్స్వింగర్లతో ఇబ్బంది పెట్టిన చాహర్..ఒక్కసారిగా ఇన్స్వింగర్ సంధించి బవుమాను బోల్తా కొట్టించాడు. రెండో ఓవర్కు దిగిన అర్ష్దీప్సింగ్..వచ్చి రావడంతోనే డీకాక్(1)ను ఔట్ చేసి తానేం తక్కువ కాదని నిరూపించాడు. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటూ వరుస బంతుల్లో రొసో(0), మిల్లర్(0)ను ఔట్ చేసి భారత్ను ఆనందంలో నింపాడు. ఆ మరుసటి ఓవర్లో చాహర్..స్టబ్స్(0)ను పెవిలియన్ పంపడంతో దక్షిణాఫ్రికా 9 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో టీ20ల్లో స్వల్ప స్కోరుకు సఫారీలు ఇన్నింగ్స్ను ముగిస్తారని అందరూ అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా మక్క్రామ్, పార్నెల్, ఆఖర్లో మహారాజ్ బ్యాట్లు ఝుళిపించడంతో గౌరవపద్రమైన స్కోరు అందుకుంది. టీమ్ఇండియా బౌలర్లు అదే దూకుడు కొనసాగించుంటే సఫారీల పరువు పోయేది.
స్వల్ప లక్ష్యఛేదనలో భారత్కు సరైన శుభారంభం దక్కలేదు. 17 పరుగులకే కెప్టెన్ రోహిత్(0), విరాట్ కోహ్లీ(3) వెనుదిరిగారు. భారత బౌలర్లు విజృంభించిన చోట తామేం తక్కువ కాదన్నట్లు సఫారీ పేసర్లు బంతులు విసరడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. అయితే మంచి ఫామ్మీదున్న సూర్యకుమార్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. రాహుల్ను అండగా చేసుకుంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో వీరిద్దరిని విడదీసేందుకు బవుమా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆఖర్లో ఒకే ఓవర్లో ఇద్దరు అర్ధసెంచరీ మార్క్ అందుకుని జట్టుకు విజయాన్నందించారు.
1-1 (బవుమా) 2-1(డికాక్)
3-8 (రొసో) 4-8(మిల్లర్)
5-9 (స్టబ్స్)
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 106/8(మహారాజ్ 41, మక్క్రామ్ 25, అర్ష్దీప్సింగ్ 3/32, చాహర్ 2/24),
భారత్: 16.4 ఓవర్లలో 110/2 (రాహుల్ 51 నాటౌట్, సూర్యకుమార్ 50నాటౌట్, రబాడ 1/16, నోర్టె 1/32)