ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం దీన్ని రనౌట్ విభాగంలో చేర్చిన సంగతి తెలిసిందే.
అయితే భారత జట్టు మోసం చేసి మ్యాచ్ గెలిచిందంటూ ఇంగ్లండ్ అభిమానులు నెట్టింట తెగ గొడవ చేస్తున్నారు. దీనిపై ఒక క్రికెట్ అనలిస్ట్ చేసిన అనాలసిస్ వైరల్ అవుతోంది. మ్యాచ్ హైలైట్స్ అంతా రిపీటెడ్గా చూసిన అతను.. ఆ మ్యాచ్లో షార్లెట్ డీన్ నాన్ స్ట్రైకర్ ఎండ్లో బౌలర్ బంతిని వేయకముందే అప్పటికి 72 సార్లు క్రీజును వదిలినట్లు తేల్చాడు.
ఆమె నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా ప్రతి 6 బంతుల్లో 5 బంతులు వేసే సమయంలో క్రీజును వదిలి ముందుకు వచ్చినట్లు ఈ అనలిస్ట్ వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, స్క్రీన్ షాట్లను కూడా తన అనాలసిస్లో చూపించాడు. డీన్తో కలిసి బ్యాటింగ్ చేసిన మిగతా ఎవరూ ఇలా చేయలేదని, డీన్ ఒక్కతే మాటిమాటికీ ఇలా చేస్తూ భారత ఆటగాళ్ల కంటపడిందని అతను చెప్పాడు.
డీన్ అలా క్రీజును వదిలి వచ్చేయడాన్ని ఫీల్డింగ్ చేస్తుండగా దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్ పలుమార్లు గమనించారని కూడా ఫొటోలు చూపించాడు. అలాగే డీన్ను అవుట్ చేసే ముందు దీప్తిశర్మ, హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుకోవడాన్ని.. డీన్ అవుట్ అయిన తర్వాత వాళ్ల హావభావాలను కూడా క్యాప్చర్ చేశాడు.
ఇవన్నీ చూసిన నెటిజన్లు సదరు అనలిస్టును మెచ్చుకోవడంతోపాటు భారత్ మోసం చేసిందని కామెంట్లు చేస్తున్న ఇంగ్లండ్ మాజీలకు ఈ అనాలసిస్ చూడాలంటూ ట్యాగ్ చేస్తున్నారు. ఇంత అనాలసిస్ చేయడం కోసం పీటర్ చేసిన కృషిని కొందరు మెచ్చుకుంటున్నారు. దీంతో ఈ రనౌట్ వివాదానికి తెరపడిందని కొనియాడుతున్నారు.
Went back to the full match replay. Charlie Dean was leaving her crease early starting with her 2nd ball at the non-striker's end in the 18th over. Ball still in bowler's hand. Dean is never looking at the bowler to see if/when the ball has been released. Basic lack of awareness. pic.twitter.com/yRokOftidg
— Peter Della Penna (@PeterDellaPenna) September 25, 2022