హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూద్దామనుకున్న అభిమానుల ఆశలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నిర్వాహకులు నీళ్లు గుమ్మరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ అంటూ ఫ్యాన్స్ను గందరగోళానికి గురిచేస్తూ ఆఖరికి టిక్కెట్లు మొత్తం అయిపోయాయంటూ చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో గంటల కొద్ది చూసి చూసి విసిగి వేసారిన వేలాది మంది అభిమానులు ఉసూరుమంటూ వెళ్లిపోయారు. మొత్తంగా 39 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఇప్పటి వరకు ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
గురువారం జింఖానలో అభిమానుల తొక్కిసలాట, పోలీసుల లాఠీచార్జ్ పరిస్థితుల దృష్ట్యా టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయినట్లు హెచ్సీఏ ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. జింఖానా ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు జింఖానలో శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టిక్కెట్లను రిడీమ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు గాను ఐడీ ప్రూఫ్తో పాటు ఈమెయిల్ కాపీని సమర్పించాలని సూచించింది.