శ్రీశైలం : కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం ఉదయం జూరాల ప్రాజెక్టు ద్వారా 75,947 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 31,365 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 21,555 క్యూసెక్కులను అధికారులు విడుదల చేశారు. దీంతో సాయంత్రం 6 గంటల వరకు రిజర్వాయర్కు 1,28,863 క్యుసెక్కుల ఇన్ఫ్లో నమోదైందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుండగా.. 55వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వెళ్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.50 అడుగులుంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను 202.04 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు.