హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశాన్ని రక్షించుకోవాలంటే మోదీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిందేనని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఏపీలోని విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక దోపిడీని ఆపాలన్నా, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవాలన్నా మోదీ సర్కారును గద్దెదించడం ఒక్కటే మార్గమన్నారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం, పేదరికం, ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 42 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉపాధి లేక ప్రజల కొనుగోలు శక్తి తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నదని మండిపడ్డారు.
ప్రజల సంక్షేమాన్ని వదిలేసిన మోదీ సర్కార్.. దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలు, రవాణా వ్యవస్థలను తెగనమ్ముతున్నదని ధ్వజమెత్తారు. పెద్దలకు రూ.11 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రద్దు చేశారని దుయ్యబట్టారు. ఉపాధిహామీకి రూ.73 వేల కోట్లు ఖర్చు పెట్టలేని కేంద్రం.. గుజరాత్కు చెందిన వేదాంత కంపెనీకి రూ.80 వేల కోట్ల మైనింగ్ సబ్సిడీ ఇచ్చిందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామంటే ఏపీ సీఎం జగన్ చోద్యం చూస్తున్నారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు.