అబ్రకదబ్ర.. అబ్రకదబ్ర.. అబ్రకదబ్ర… అద్భుతం జరిగింది.. రైతుల ఆదాయం రెట్టింపైంది.. నమ్మండి నమ్మకపోండి.. కండ్లకు గంతలు కట్టే కనికట్టు ఇది. మోదీంద్రజాలం ఇది. 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఎనిమిదేండ్ల క్రితం హామీ ఇచ్చి ప్రధాని అయిన మోదీ.. ఇన్నేండ్లు ఆ ఊసెత్తకపోగా, ఇప్పుడు ఏకంగా ఆదాయం డబుల్ అయ్యిందంటూ కేంద్రం ప్రకటించడం అందరినీ విస్మయపరుస్తున్నది.
ఎనిమిదేండ్లలో రైతుల పంట పెట్టుబడి ఖర్చులు రెట్టింపు అయ్యాయని ఓ వైపు విపక్షాలు విమర్శిస్తుండగా.. ఆదాయం డబుల్ అయ్యిందంటూ కేంద్రం నమ్మించే ప్రయత్నం చేయడం నవ్వుతెప్పిస్తున్నది. ఎనిమిదేండ్లలో పంటల కనీస మద్దతు ధర 5శాతం మాత్రమే పెరిగిందని చెబుతున్న వ్యవసాయరంగ నిపుణులు.. ఖర్చులు రెట్టింపైన నేపథ్యంలో అప్పులే మిగులుతాయని, ఆదాయం డబుల్ ఎలా అయ్యిందని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్, జులై 16 (నమస్తే తెలంగాణ) : ‘దేశమంతా బహిరంగ మలవిసర్జన రహితమైంది’.. ‘అన్ని గ్రామాలకు విద్యుదీకరణ పూర్తయ్యింది’.. ‘గ్రామ గ్రామానికీ రోడ్డు సదుపాయం ఉంది’.. ‘దేశంలోని ప్రతీ పేదవాడు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందుకుంటున్నాడు’.. గత నెలలో జీ-7 దేశాల సదస్సు కోసం జర్మనీ వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ అంతర్జాతీయ వేదికపై వల్లెవేసిన అసత్యాల ప్రహసనమిది.. ఇప్పుడీ గప్పాల జాబితాలో రైతుల ఆదాయం రెట్టింపు అంశం కూడా వచ్చి చేరింది.
రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు కలలుకన్న కేంద్రం.. చివరకు రెట్టింపు అయిపోయిందన్న భ్రమకు లోనైంది. అంతటితో ఆగకుండా దేశవ్యాప్తంగా రైతుల ఆదాయం రెట్టింపైనట్టు ప్రకటించేసింది కూడా. ఇదే విషయాన్ని నేరుగా చెప్పే ధైర్యం లేక కేంద్ర వ్యవసాయశాఖ ట్విట్టర్లో ఈ మేరకు ఓ పోస్టును పెట్టింది. కలలకు లెక్కలుండవు కాబట్టి.. ఈ ప్రకటనకు సంబంధించి ఎలాంటి లెక్కలనూ వెల్లడించలేదు. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ రైతు ఆదాయం.. ఏ విధంగా.. ఆదాయం రెట్టింపైందో వివరాలేవీ లేవు. తమ ఆదాయం డబుల్ అయిన విషయం.. రైతులకైనా తెలుసో లేదో మరి.
రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేస్తామని 2014లో ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో 2022 ఆగస్టు వరకు దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఇందుకు సంబంధించి రోడ్మ్యాప్ కూడా సిద్ధమైందని ప్రకటించారు. అయితే అప్పటినుంచీ రైతుల మేలు కోసం కేంద్రప్రభుత్వం వెలగపెట్టిన కార్యక్రమాలేవీ లేవు. పైపెచ్చు ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పెట్టుబడి ఖర్చును రెట్టింపు చేసిన కేంద్రం.. ఆదాయం డబుల్ అయ్యిందంటూ ప్రకటించడం ప్రజల్ని మోసగించడ మేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిం దంటూ కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించగా.. అందుకు భిన్నంగా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్య లు చేయడం గమనార్హం. ‘ఏఆర్డీబీల సహకారం లేకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న మోదీ కలల్ని నిజం చేయలేం’ అని శనివారం ఢిల్లీలో జరిగిన గ్రామీణాభివృద్ధి బ్యాంకుల సదస్సులో అమిత్షా పేర్కొన్నారు.
ఒకవైపు కేంద్ర వ్యవసాయశాఖ రైతుల ఆదాయం డబుల్ అయ్యిందని చెప్తుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్షా అందుకు భిన్నంగా వ్యాఖ్యానించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రధాని మోదీ కలలు నిజం కావాలంటే వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుల సహకారం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. ‘ఏఆర్డీబీల సహకారం లేకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న మోదీ కలల్ని నిజం చేయలేం’ అని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి బ్యాంకులు ఢిల్లీలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయరంగ అభివృద్ధికి దీర్ఘ కాల రుణాలు ఎక్కువ మేలు చేస్తాయన్నారు. అప్పుడే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అన్నారు.
రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే… ఏకైక సూత్రం పండించిన పంటకు మద్దతు ధర రెట్టింపు కావాలి. పెట్టుబడి ఖర్చు తగ్గాలి. కానీ పెట్టుబడి ఖర్చు రెట్టింపైనా, మద్దతు ధర అంతంత మాత్రంగానే పెరిగినా.. రైతుల ఆదాయం మాత్రం డబుల్ అయ్యిందంటూ కేంద్రం నమ్మబలకడం విస్మయపరిచేలా ఉంది. గడిచిన 8ఏండ్లలో పలు పంటలకు మద్దతు ధర పెరిగింది 6 శాతంలోపే. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర రెట్టింపు కాలేదు. దీంతోపాటు ఎరువులు, డీజిల్ ధరలు సుమారు 30-50 శాతం వరకు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ఆదాయం ఎలా రెట్టింపు అయ్యిందో చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రైతులు అధికంగా పండించే వరి, పత్తి, గోదుమ ధరలు అత్తెసరుగానే పెరిగాయి. గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో వరికి పెరిగిన మద్దతు ధర కేవలం రూ. 630 మాత్రమే. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే వరి ధర క్వింటాలుకు రూ. 2620 ఉండాలి. కానీ 2021-22 ధరల ప్రకారం ఉన్నది రూ. 1940 మాత్రమే. అదే విధంగా పత్తి ధర రూ. 7400గా ఉండాలి. కానీ ప్రస్తుతం పత్తి ధర రూ. 5726 మాత్రమే. గోధుమకు ఉండాల్సిన ధర రూ. 2800 కానీ ఉన్నది రూ. 2015 మాత్రమే. ఈ విధంగా ఏ పంటను లెక్కించినా… మద్దతు ధర అంతంత మాత్రంగానే పెరిగింది. అదే విధంగా పెట్రోల్ ధర లీటరుకు రూ. 38, డీజిల్ ధర రూ. 42 పెరిగింది. డీజిల్ ధరలు పెరగడంతో దున్నకం ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు దుక్కి దున్నేందుకు గంటకు రూ. 500-600 తీసుకుంటే ఇప్పుడది రూ. 1000-1200లకు పెరిగింది. దీనికి తోడు విత్తనాలు, ఎరువుల ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఈ విధంగా వ్యవసాయానికి అవసరమైన అన్ని ధరలు పెరగడంతో సాగు భారం రెట్టింపు అయ్యింది.
హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ):“రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలకు ప్రతిస్పందనగా, దేశంలో చాలా పెద్ద సంఖ్యలో రైతుల ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది”. అని భారత ప్రభుత్వ వ్యవసాయశాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వ్యవసాయ శాఖ చెబుతున్నది నిజమైతే.. ఆ వివరాలను దేశ ప్రజలకు అందించాలని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఎన్ని లక్షల మంది రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారు.. ఆదాయం పెరిగిన రైతులు ఏ రాష్ర్టానికి చెందినవారు.. దీన్ని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలకమైన చొరవ ఏంటి.. అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు స్పందించారు. సుప్రీం లీడర్ దీనికైనా మీరు సమాధానం చెబుతారా.. లేక ఇది మరో జుమ్లానా.. అని నటుడు ప్రకాశ్రాజ్ ట్వీట్ చేశారు. ఎంత మంది రైతుల ఆదాయం పెరిగిందో కేంద్ర వ్యవసాయ వెల్లడించాలని.. తప్పుడు ప్రచారం చేయడం.. అసత్యాలు మాట్లాడటంలో మిమ్ములను మించినోళ్లు లేరని నెటిజన్లు మండిపడ్డారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రపంచంలోనే మరెక్కడా లేవంటూ ప్రశంసలు కురిపించారు.
కేంద్రం చెప్పిన లెక్క ప్రకారం రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యం చేరుకోవాలంటే రైతుల నెలవారీ ఆదాయం రూ. 21,146 ఉండాలి. కానీ 2021-22 నాటికి రైతుల ఆదాయం రూ. 12,952 మాత్రమే. అంటే ఇంకా రూ. 8194 ఆదాయం తక్కువగా ఉంది. కానీ కేంద్రం మాత్రం ఆదాయం రెట్టింపు అయినట్లుగా తప్పుడు ప్రకటనలు చేసుకోవడం విడ్డూరం. పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక ప్రకారం 2015-16లో రైతుల ఆదాయం నెలవారి ఆదాయం రూ. 8059 కాగా, 2018-19లో రూ. 10,218కి పెరిగింది. అంటే నాలుగేండ్లలో పెరిగిన ఆదాయం కేవలం 27శాతం మాత్రమే.
‘సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో మోదీ కలలుగన్నట్టు రైతుల ఆదాయం రెట్టింపైంది. దేశవ్యాప్తంగా అన్నదాతల విజయగాథలే ఇందుకు సాక్ష్యం’
– కేంద్ర వ్యవసాయశాఖ ట్వీట్
of doubled under ‘s leadership