న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశంలో సెమికండక్టర్ చిప్ల ఉత్పత్తిని, డిజైన్ను వృద్ధిచేసేదిశగా కేంద్రం త్వరలో ప్రోత్సాహక విధానాన్ని ప్రకటించనుంది. దేశంలో చిప్స్ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ చిప్ కంపెనీల్ని ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ చిప్ తయారీ దిగ్గజాలైన క్వాల్కామ్, ఇంటెల్, ఇన్ఫినియోన్, టెక్సాన్ ఇనుస్ట్రుమెంట్స్కు చిప్సెట్స్ను రూపొందించే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఇప్పటికే ఇండియాలో ఉన్నాయి. దేశంలో చిప్ల తయారీ కోసం ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు రూపకల్పన దశ నుంచి ఉత్పత్తి దశవరకూ మౌలిక, ఆర్థిక మద్దతును అందించేరీతిలో సెమికండక్టర్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ఉన్నతాధికార వర్గాలు వివరించాయి.
ఎంఎస్ఎంఈలు, లేదా స్టార్టప్లు చిప్లను ఉత్పత్తి చేసి, మార్కెట్లో వాటి విక్రయాల్ని ప్రారంభించిన తర్వాత.. నికర అమ్మకాల టర్నోవర్పై అదనపు ప్రోత్సాహకాల్ని ఇచ్చేలా స్కీము ఉంటుందని వారన్నారు. చిప్స్ తయారీ రంగంలో రోడ్మ్యాప్ను చర్చించేందుకు ప్రభుత్వం నవంబర్ నెలలో సెమికండక్టర్ కంపెనీలతో ఒక సదస్సును ఏర్పాటుచేయనున్నట్లు ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
25కిపైగా చిప్ డిజైన్ కంపెనీల ఏర్పాటుదిశగా…
సెమికండక్టర్ డిజైన్డ్ లింక్డ్ ప్రోత్సాహక విధానం తీసుకొస్తే ఈ విభాగంలో ఇండియా బలాన్ని వెలికితీయడం సాధ్యపడుతుందని ఇండియా ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్స్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) చైర్మన్ రాజీవ్ ఖుషు అన్నారు. దీంతో వచ్చే కొద్ది సంవత్సరాల్లో 25కిపైగా చిప్ డిజైన్ కంపెనీల ఏర్పాటయ్యే అవకాశం ఉంటుందని, ప్రపంచ చిప్ మార్కెట్లోకి ఇండియా ప్రవేశిస్తుందన్నారు. హై ఎండ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అమ్మకాల ద్వారా ఎలక్ట్రానిక్ చిప్ కంపెనీలు ఆదాయం ఆర్జించడానికి సెమికండక్టర్ చిప్ డిజైన్ కీలకం.