లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయం అక్కడ వెలిసింది. ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తి అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలోని అయోధ్య-గోరఖ్పూర్ హైవే పై ఉన్న భరత్కుండ్లో యోగి ఆదిత్యనాథ్కు గుడి కట్టారు. రాముడి రూపంలో ఉన్న ఆదిత్యనాథ్ విగ్రహాన్ని అందులో ఏర్పాటు చేశారు. యోగిని పొడుగుతూ భజనలు చేయడంతోపాటు హారతులు ఇస్తూ దేవుడి మాదిరిగా పూజలు చేస్తున్నారు. యోగి ఆలయంపై ప్రచారం కోసం భజనల ఆడియో, వీడియో సీడీలను సిద్ధం చేశారు.
కాగా, అయోధ్యలో శ్రీరాముడి ఆలయానికి కృషి చేసిన వారికి గుడి కడతానని తాను గతంలో తీర్మానించుకున్నట్లు ప్రభాకర్ మౌర్య తెలిపాడు. ప్రస్తుతం అఖండ రామాలయం నిర్మితమవుతున్నది, ఈ నేపథ్యంలో దీనికి కీలక పాత్ర పోషించిన సీఎం యోగి ఆదిత్యనాథ్కు గుడి కట్టినట్లు చెప్పాడు. ఆయన ఎత్తు, వస్త్రధారణలో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించాడు. యూపీలోని బారాబంకి జిల్లాకు చెందిన తన స్నేహితుడు రెండు నెలల్లో రాముడిని పోలిన యోగి ఆదిత్యనాథ్ విగ్రహాన్ని తయారు చేసినట్లు ఆయన వెల్లడించాడు. అయితే రాముడిని పోలినట్లుగా సీఎం యోగి ఆదిత్యనాథ్కు గుడి కట్టి పూజలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.