పూరీ విత్ బిర్యానీ | ఎంత లావుగా పొంగిన పూరీలైనా ఆత్మారాముడిని సంతృప్తిపరచాలంటే అందులోకి నంజుకునే కూర అదిరిపోవాలి. నిమ్మరసం పిండిన బొంబాయి చట్నీ, ఉడికీ ఉడకని పెసరపప్పు టమాట, అల్లం పచ్చికారం దట్టించి మెత్తగా ఉడికించిన ఆలూ కుర్మా.. ఇలా కాంబినేషన్ బాగుంటేనే పూరీ రుచి బాగుంటుంది. దేశ రాజధాని హస్తినలో మాత్రం కొత్త ట్రెండ్ పురుడుపోసుకుంది.
స్ట్రీట్ఫుడ్ అమ్ముకునే లాల్భాయ్ పూరీలోకి వెజ్ బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ను ఆస్వాదించడానికి ఫుడ్ లవర్స్ వరుసలు కడుతున్నారు. ‘మొదట నేను పూరీతో ఆలుగడ్డ కూర ఇచ్చేవాడిని. కాకపోతే, ఇప్పుడు చాలాచోట్ల వెజ్ బిర్యానీ ఫుడ్కోర్ట్లు వెలిశాయి. దీంతో నేనూ వెజ్ బిర్యానీ అమ్మకం మొదలుపెట్టాను. అయితే, కాస్త కొత్తగా ఆలోచించి బిర్యానీలోకి ఆలూకుర్మా తోపాటు పూరీలనూ ఇస్తున్నాను. దీంతో కస్టమర్లు ఆబగా తినేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు వ్యాపారం పెరిగింది. పొగలు కక్కుతున్న బిర్యానీని పూరీతో కలిపి తింటున్న కస్టమర్లను చూస్తుంటే నాకూ తినాలనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు లాల్. రాజధాని వీధిలో మొదలైన ఈ నయా కాంబినేషన్ మున్ముందు ఎన్ని ఎల్లలు దాటుతుందో చూడాలి.