దక్షిణాఫ్రికా గడ్డపై ఎలాగైనా టెస్టు సిరీస్ గెలువాలన్న పట్టుదలతో ఉన్న భారత్ ఆ దిశగా దూసుకెళుతున్నది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సెంచూరియన్లో సఫారీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. టీమ్ఇండియా నిర్దేశించిన 305 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 94 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. సహచరులు విఫలమైన చోట ఎల్గర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో కదంతొక్కాడు. బుమ్రా బుల్లెట్ బంతులకు సఫారీలు విలవిలలాడిపోయారు. బుమ్రాకు తోడు షమీ, సిరాజ్, శార్దుల్ చెలరేగితే తొలి టెస్టు మన ఖాతాలో చేరినట్లే. విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉన్న భారత్..మిగతా బ్యాటర్ల పనిపడితే మూడు టెస్టుల సిరీస్లో మనం ముందంజ వేసినట్లే.
సెంచూరియన్: తొలి టెస్టులో భారత్ గెలుపు వాకిట్లో నిలిచింది. ఆరు వికెట్లు పడగొడితే దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో మన విజయం ఖాయమైనట్లే. టీమ్ఇండియా నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగోరోజు ఆట ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 94 పరులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్(52 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, ఓపెనర్ మార్క్మ్(్ర1), పీటర్సన్(17), డస్సెన్(11) ఘోరంగా విఫలమయ్యారు. బుమ్రా(2/22)కు రెండు వికెట్లు దక్కగా, షమీ(1/29), సిరాజ్(1/25) ఒక్కో వికెట్ తీశారు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న సఫారీలు లక్ష్యానికి 211 పరుగుల దూరంలో ఉన్నారు. ఎల్గర్ క్రీజులో ఉండగా, నైట్వాచ్మన్ మహారాజ్(8) నాలుగో వికెట్గా వెనుదిరిగాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 16/1 నాలుగో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్కు దిగిన టీమ్ఇండియా 50.3 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్(34) ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ(4/42), జాన్సెన్(4/55) నాలుగేసి వికెట్లతో రాణించారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(18), రహానే(20), పుజార(16) స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారు.
దక్షిణాఫ్రికా 94/4:
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యఛేదనకు దిగిన సఫారీలకు ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ మార్క్మ్(్ర1)ను ఔట్ చేసిన షమీ వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన పీటర్సన్..ఎల్గర్కు జత కలిశాడు. వీరిద్దరు కలిసి నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరో వికెట్కోసం ప్రయత్నించిన టీమ్ఇండియా బౌలర్లకు 15వ ఓవర్ వరకు నిరీక్షణ తప్పలేదు. అద్భుతమైన స్వింగ్తో పీటర్సన్ను హైదరాబాదీ స్పీడ్స్టర్ సిరాజ్ బోల్తా కొట్టించాడు. డ్రైవ్ షాట్ ఆడే క్రమంలో పీటర్సన్…కీపర్ పంత్ చేతికి చిక్కాడు. సెకండ్ డౌన్లో వచ్చిన డస్సెన్, ఎల్గర్ కలిసి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరు భారీ షాట్లకు పోకుండా డిఫెన్స్కు పరిమితమయ్యారు. ముఖ్యంగా ఎల్గర్ తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో వీరు 22 ఓవర్ల పాటు క్రీజులో పాతుకుపోయారు. అయితే నాలుగు ఓవర్ల వ్యవధిలో డస్సెన్, మహారాజ్ను బుమ్రా క్లీన్బౌల్డ్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు.
భారత్ 174 ఆలౌట్:
సఫారీల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలన్న పట్టుదలతో రెండో ఇన్నింగ్స్కు దిగిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నైట్వాచ్మన్ శార్దుల్ ఠాకూర్(10) తన వ్యక్తిగత స్కోరుకు మరో ఆరు పరుగులు జోడించి రెండో వికెట్గా వెనుదిరిగాడు. సఫారీ బౌలర్ల విజృంభణతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియాను పంత్, అశ్విన్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్కు 35 పరుగులు జోడించారు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్:327 ఆలౌట్, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 197 ఆలౌట్, భారత్ రెండో ఇన్నింగ్స్: 174 ఆలౌట్, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 94/4(ఎల్గర్ 52 నాటౌట్, బుమ్రా 2/22)