హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిధిలోని పురావస్తుశాఖలో శిలాశాసనాల డిజిటలీకరణ కాంట్రాక్టును అప్పగించడంలో నిబంధనలు పాటించలేదని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రవీందర్రెడ్డి (రవి ప్రెస్ ఫొటో) హైకోర్టును ఆశ్రయించారు. రూ.5,61,68,000 విలువైన కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రీతమ్కుమార్ వాదనలు వినిపించారు.
కేంద్ర పురావస్తుశాఖ దేశవ్యాప్తంగా ఉన్న లక్ష శిలాశాసనాలను డిజిటలీకరించేందుకు ఈ ఏడాది జూలై 5న ‘జియోపెల్ ఇంపోర్ట్- ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్’కు నామినేషన్ పద్ధతిలో రూ.5.61 కోట్ల కాంట్రాక్టును అప్పగించిందని పేర్కొన్నారు. సాధారణ సమయాల్లో టెండర్ల ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ పాటించాలని, విపరీత పరిస్థితుల్లో మాత్రమే నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తుంటారని గుర్తుచేశారు.
ఈ ఏడాది జూలైలో ఎలాంటి విపరీత పరిస్థితులు లేవని చెప్పారు. పైగా అంతకుముందే కేంద్ర పురావస్తుశాఖ దేశవ్యాప్తంగా ఉన్న 74 వేల శిలాశాసనాలను డిజిటలైజ్ చేసేందుకు రూ.1.50 కోట్లకు టెండర్లు పిలిచిందని ధర్మాసనానికి తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తి కాకముందే సుమారు నాలుగు రెట్ల అధిక ధరకు జియోపెల్కు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని పేర్కొన్నారు.
ఈ వివరాలు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో నమోదు కాలేదన్నారు. మరోవైపు ఈ టెండరును దక్కించుకొనేందుకు కావాల్సిన అర్హతలు ఏవీ జియోపెల్కు లేవని, ఇది ఒక డొల్ల కంపెనీ అని వివరించారు. దీనిని బట్టి పనుల అప్పగింతలో కేంద్ర పురావస్తుశాఖ నియమనిబంధనలు పాటించలేదని స్పష్టం అవుతున్నదన్నారు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపేలా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు.