హైదరాబాద్: గుజరాత్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 36వ జాతీయగేమ్స్లో రాష్ట్ర యువ టీటీ ప్లేయర్ ఆకుల శ్రీజ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. తన అద్భుత ఆటతీరుతో రాష్ట్రం తరఫున అదరగొడుతున్నది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 8-11, 7-11, 8-11, 14-12, 9-11 తేడాతో సుతీర్థ ముఖర్జీ(పశ్చిమబెంగాల్) చేతిలో ఓడి రజతం ఖాతాలో వేసుకుంది. అదే జోరు ప్రదర్శిస్తూ మిక్స్డ్ డబుల్స్లో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్తో కలిసి తుదిపోరులో బరిలోకి దిగిన శ్రీజకు నిరాశ ఎదురైంది. శ్రీజ, స్నేహిత్ ద్వయం 8-11, 5-11, 6-11తో గుజరాత్ జోడీ మానుశ్షా, కిత్వికా సిన్హారాయ్ చేతిలో ఓడి వెండి పతకంతో సంతృప్తిపడింది. మరోవైపు మహిళల టీమ్ ఈవెంట్లోనూ తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కడంలో శ్రీజ కీలక భూమిక పోషించింది.