చెన్నై : తమిళనాడు ఘోర ఘటన చోటు చేసుకున్నది. పటాకుల దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం కాగా.. మరో పది మందికిపైగా గాయపడ్డట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంకరాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పటాకుల దుకాణం కావడంతో అగ్నికీలలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఓ బేకరీలో గ్యాస్ సిలిండర్ సైతం పేలిపోయింది. దీంతో ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగడంతో శంకరాపురం – కల్లకురచి రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీపావళి పండుగకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పటాకుల దుకాణాలకు జనం పోటెత్తుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా బాణాసంచా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.