జైపూర్: లిఫ్ట్ గుంతలో పడి కాలేజీ విద్యార్థి మరణించాడు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. ఉత్తర ప్రదేశ్లోని వారణాసికి చెందిన కుషాగ్ర మిశ్రా, మణిపాల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. జైపూర్లోని అజ్మీర్ రోడ్లో ఉన్న మై హవేలీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ 11వ అంతస్తులోని ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం రాత్రి బయటకు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వెళ్లి బటన్ నొక్కాడు. అయితే లిఫ్ట్ క్యాబిన్ కిందకు రాకుండానే డోర్ తెరుచుకుంది. దీంతో చూసుకోకుండా అడుగు పెట్టిన కుషాగ్ర మిశ్రా 11వ అంతస్తు నుంచి లిఫ్ట్ గుంతలో పడి చనిపోయాడు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఆ విద్యార్థి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. మరోవైపు లిఫ్ట్ పని చేయడం లేదని, బిల్డర్ పట్టించుకోవడంలేదని అపార్ట్మెంట్ నివాసితులు ఆరోపించారు. ఈ సంఘటన నేపథ్యంలో బిల్డర్పై వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.