మర్రిగూడ/చండూరు/సంస్థాన్నారాయణపుర,సెప్టెంబర్ 5: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కారెక్కేందుకు పోటీ పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మర్రిగూడ మండలం కమ్మగూడెం ఎంపీటీసీ శిలువేరు విష్ణు, ఆ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కొయ్య ఆరోగ్యయ్య ఆధ్వర్యంలో 30 కుటుంబాలు సోమవారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారం క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చొప్పరివారిగూడెం సర్పంచ్ భర్త చొప్పరి వెంకన్న తిరిగి టీఆర్ఎస్లో చేరారు.
గట్టుప్పల మండలం తెరట్పల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు వార్డు సభ్యులతో పాటు 100 మంది కార్యకర్తలు కూసుకుంట్ల సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన మూడు కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి.