శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే కుల్గామ్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. బట్పోరా, అహ్వాతూ ఏరియాల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
బట్పోరా ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో జైష్ ఎ మహ్మద్ సంస్థకు చెందిన పాకిస్థాన్ ఉగ్రవాది హతమయ్యాడు. కశ్మీర్ ఏరియాలో జరిగిన పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో అతని హస్తం ఉన్నదని పోలీసులు తెలిపారు. ఇక అహ్వాతూ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో జైష్ ఎ మహ్మద్కే చెందిన స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు.
ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి భారీగా మారణాయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం కుల్గామ్ జిల్లాలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అయినప్పటికీ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని ఆయన చెప్పారు.