న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, జిమ్లు తెరుచుకోనున్నాయి. అయితే స్కూళ్లను దశలవారీగా తెరుస్తారు. తొలుత 9-12 తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకున్నది. అయితే టీకా తీసుకోని ఉపాధ్యాయులను విధులకు అనుమతించబోమని తెలిపింది. అన్ని కార్యాలయాలు వంద శాతం సిబ్బంది హాజరుతో పని చేయవచ్చని పేర్కొంది.
మరోవైపు ఒంటరిగా కారు నడిపే డ్రైవర్లకు మాస్క్ ధరించడం నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే రాత్రి కర్ఫ్యూ సమయాన్ని కుదించారు. ఇప్పటి వరకు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటున్నది. అయితే దీనిని రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేస్తారు.
కాగా, ఢిల్లీలో కరోనా పరిస్థితి మెరుగుపడటంతోపాటు 15-18 ఏండ్ల వయసు వారు టీకాలను పెద్ద సంఖ్యలో పొందినట్లు డీడీఎంఏ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్కూళ్లను తెరువడంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా, జనవరి 27 నుంచి వారాంతపు కర్ఫ్యూ, మార్కెట్ వద్ద సరి బేసి విధానాన్ని ఎత్తివేశారు. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లను 50 శాతం సామర్థ్యంతో ఇప్పటికే అనుమతిస్తున్నారు. వ్యాపారాలకు సంబంధించి అన్ని ఆంక్షలను ఎ్తతివేశారు.