న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ను దేశ రాజధాని ఢిల్లీలో గుర్తించారు. వేరియంట్ బీఏ 2.75కు మరింతగా వ్యాపించే గుణం ఉందని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) హాస్పిటల్ వైద్యాధికారులు గురువారం తెలిపారు. ఈ వారంలో 90 మంది కరోనా రోగుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్, విశ్లేషణకు పంపినట్లు చెప్పారు. ఇందులో సగానికిపైగా నమూనాల్లో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఏ 2.75ను గుర్తించినట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ గత వేరియంట్ కంటే ఇది మరింతగా వ్యాపిస్తుందని వివరించారు. అయితే అనారోగ్యం తీవ్రత తక్కువగానే ఉన్నదని, ఐదు నుంచి వారం రోజుల్లోనే రోగులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
మరోవైపు, ఢిల్లీలో గత 24 గంటల్లో 2,146 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 8 మంది మరణించారు. గత 24 గంటల్లో దేశంలో ఇదే గరిష్ఠ సంఖ్య. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నారు. అయితే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే వారికి ఇది వర్తించదని అధికారులు తెలిపారు.