ముంబై : కొవిడ్ కారణంగా గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్నా చితకా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పలు కంపెనీలు మూతపడ్డాయి. అందరికీ ఏదో ఒక విధంగా నష్టం కలిగించిన కరోనా వైరస్ మహమ్మారి.. బ్యాంకులను మాత్రం కరుణించింది. కొవిడ్ సమయంలో బ్యాంకులు 2021 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్లకు పైగా లాభాలు సాధించాయి. ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారవుతున్నా.. బ్యాంకులు లాభాల బాట పట్టడం ఆశ్చర్యకరంగా ఉన్నది. 2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.5 వేల కోట్ల మేర నష్టపోయాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్లకు పైగా లాభాలు రావడం బ్యాంకులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని బ్యాంకులు రూ.1,02,252 కోట్ల లాభాలు ఆర్జించాయి. ఈ మొత్తంలో 50 శాతం హెచ్డీఎఫ్సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల వాటాలే ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు రూ.31,116 కోట్ల లాభాలు వచ్చాయి. అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే లాభాల్లో 18 శాతం పెరుగుదల కనిపించింది. ఎస్బీఐకి రూ.20,410 కోట్ల లాభాలు వచ్చాయి. రూ.16,192 కోట్ల లాభాలు ఆర్జించి ఐసీఐసీఐ బ్యాంకు మూడో స్థానంలో నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంకు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలకు రెట్టింపుగా గత ఆర్థిక సంవత్సరం లాభాలను నమోదు చేసుకున్నది.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో బేరీజు వేసుకుంటే ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు మంచి లాభాలను పొందాయి. ఐదేండ్లలో తొలిసారిగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు సమిష్టి నికర లాభాలను ఆర్జించాయి. 12 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంకుల్లో కేవలం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక ప్రైవేట్ సెక్టార్లో యెస్ బ్యాంకు కూడా పెద్ద మొత్తంలో నష్టాలను చవిచూసింది. యెస్ బ్యాంకుకు రూ.3,462 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా కారణంగా రుణాలు తీసుకున్నవారు తమ రుణాలను తిరిగి షెడ్యూల్ చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించడంతో కరోనా మహమ్మారి ప్రభావం బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై ప్రతిబింబించలేదు. రుణాలు తీసుకున్నవారు ఈఎంఐలు చెల్లించేందుకు ఆర్బీఐ మరో ఏడాది కాలం అనుమతించింది.