మీరట్ : వడ్డీ వ్యాపారి వేధింపులు శ్రుతిమించడంతో మీరట్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో వ్యాపారి తనంతట తను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మృతుడు యోగీంద్ర సింగ్ (48) కారు లోపల కూర్చుని తనపై కాల్పులు జరుపుకున్నాడు. మీరట్ ఎస్పీ ప్రభాకర్ చౌధరి ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఘటనా స్ధలాన్ని సందర్శించారు. మృతుడి వద్ద సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య, హత్య కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. డబ్బు కోసం వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక యోగీంద్ర తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బాధితుడు యోగీంద్ర సింగ్ మోహన్పురిలోని సివిల్ లైన్స్లో నివసిస్తాడని పోలీసులు గుర్తించారు. పీఎల్ శర్మ రోడ్డులో ఆయన ఇన్వర్టర్-బ్యాటరీ షోరూం నడుపుతున్నాడని చెప్పారు. ఆయన భార్య టీచర్గా పనిచేస్తోంది. యోగేంద్ర తన కారులో మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో షాపు నుంచి బయలుదేరాడని సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన కారును ఎస్పీ కార్యాలయం వద్ద గుర్తించారు. కారులో మృతదేహం పడిఉండటాన్ని అటుగా వెళుతున్న వ్యక్తి చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు నుంచి లైసెన్డ్స్ తుపాకీ, ఖాళీ క్యాట్రిడ్జ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజ్కుమార్ సిరోహి అనే వ్యక్తి భారీ వడ్డీతో రుణం తిరిగి చెల్లించాలని తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని బాధితుడి సోదరుడు దీపక్ ఆరోపించారు. కొద్దికాలం కిందదట సిరోహి నుంచి యోగీంద్ర రూ 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, కరోనా మహమ్మారితో వ్యాపారం దెబ్బతినడంతో డబ్బు చెల్లించలేకపోయాడని చెప్పారు. భారీ వడ్డీతో రుణాన్ని చెల్లించాలని సిరోహి బెదిరింపులకు గురిచేస్తున్నాడని దీపక్ వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.