భువనేశ్వర్ : జంట హత్యల కేసు ఒడిషాలో కలకలం రేపింది. వ్యక్తిగత వివాదాల నేపధ్యంలో భార్యతో పాటు మరదలిని హత్య చేసిన వ్యక్తి రోజుల తరబడి మృతదేహాలను ఇంట్లోనే దాచాడు. మృతులను గాయత్రి సేథి ఆమె సోదరి సరస్వతిగా గుర్తించారు. గాయత్రి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. గురువారం వీరిని హత్యచేసిన నిందితుడు విజయ్ కేతన్ సేథి గాయత్రి, సరస్వతిల మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేశాడు.
విజయ్ సేథి వ్యక్తిగత వివాదాలతో ఇద్దరు మహిళలను హత్య చేశాడని, హత్యకు దారితీసిన పరిస్ధితులపై మరింత సమాచారం వెల్లడికావాల్సి ఉందని ఏసీపీ రమేష్ బిషోయ్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు. బాధితురాళ్ల తండ్రి వివరాలు వెల్లడిస్తూ గురువారం తన ఇద్దరు కూతుళ్లకు ఫోన్ చేయగా వారి మొబైల్ ఫోన్లు స్విచాఫ్ అయ్యాయని చెప్పారు.
ఆపై తాము భువనేశ్వర్కు రాగా ఇంటికి తాళం వేసి ఉందని, తమ అల్లుడు కూడా కనిపించలేదని తమ కాల్స్ను లిఫ్ట్ చేయలేదని తెలిపారు. ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లేందుకు వచ్చినప్పుడు తాము అతడిని పట్టుకున్నామని చెప్పారు. పోలీసులు మృతదేహాలను స్వాదీనం చేసుకుని పోస్ట్మార్టానికి తరలించారు.