చెన్నై : బాలికను బర్త్డే పార్టీకి ఆహ్వానించి ఆపై ఆమెపై ముగ్గురు సహవిద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలిక (15)ను అదే స్కూల్లో పన్నెండో తరగతి చదివే విద్యార్ధి బర్త్డే పార్టీకి ఆహ్వానించారు. పార్టీకి వచ్చిన బాలికను మాట్లాడాలంటూ పదో తరగతి చదివే విద్యార్ధి వేరే గదిలోకి తీసుకువెళ్లాడు. ఆ గదిలోకి మరో ఇద్దరు స్నేహితులను పిలిచి ఆపై గది తలుపులు మూసివేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలికపై నేరాన్ని వీరు వీడియోలో రికార్డు చేశారు. అదే స్కూల్కు చెందిన విద్యార్ధులకు ఆ వీడియోను చేరవేశారు. ఘటన అనంతరం బాలిక స్కూల్కు వెళ్లేందుకు నిరాకరించడంతో ప్రశ్నించిన తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులతో కలిసి బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.