న్యూఢిల్లీ : ఉద్యోగం రాలేదని మనస్ధాపంతో 21 ఏండ్ల విద్యార్ధిని నోయిడాలోని సెక్టార్ 56లోని హోటల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడింది. ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లో ఇంజనీరింగ్ పైనల్ ఇయర్ చదువుతున్న యువతి బుధవారం రాత్రి హోటల్ రూంలో ఉరివేసుకుని విగతజీవిగా మారడం కలకలం రేపింది. తల్లితండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను తాను నెరవేర్చలేకపోతున్నానని అక్కడ లభ్యమైన సూసైడ్ నోట్లో బాధితురాలు రాసుకొచ్చింది.
క్యాంపస్ ప్లేస్మెంట్లో విఫలం కావడంతోనే విద్యార్ధిని తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకు అర్జెంట్ పనిఉందని చెప్పి యువతి ఇంటి నుంచి బయటకు రాగా, సాయంత్రం ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమె ఫోన్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టి నోయిడాలోని హోటల్ రూంలో ఉన్నట్టు గుర్తించారు. లోపలి నుంచి గడియ వేసి ఉండటంతో మాస్టర్ కీ సాయంతో తలుపు తెరిచిన పోలీసులకు విగతజీవిలా కనిపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.