న్యూఢిల్లీ : ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత అదిగో..ఇదిగో అంటూ నియామక ప్రక్రియలో జాప్యం చేసిన విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర వంటి ఐటీ దిగ్గజాలు తాజాగా యూటర్న్ తీసుకున్నాయి. ఫ్రెషర్స్కు ఇచ్చిన ఆఫర్ లెటర్లను ఇప్పుడవి తోసిపుచ్చుతున్నాయి. నెలల తరబడి నియామక ప్రక్రియను తొక్కిపెట్టిన తర్వాత టెక్ దిగ్గజ సంస్ధలు సహా పలు ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లను తిరస్కరిస్తున్నాయని సమాచారం.
మూడు, నాలుగు నెలల కిందట తాము ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్ర వంటి టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నామని, పలు రౌండ్ల ఇంటర్వ్యూల తర్వాత తమకు ఆఫర్ లెటర్లు ఇవ్వగా తామిప్పుడు కంపెనీల్లో చేరేందుకు వేచిచూస్తున్నామని విద్యార్ధులు చెబుతున్నారు. కాగా తమ ఆఫర్ లెటర్లను రద్దు చేశామని తమకు ఆయా కంపెనీల నుంచి లెటర్స్ వచ్చాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హతా నిబంధనలు, కంపెనీ మార్గదర్శకాల పేరుతో ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు ఆయా కంపెనీలు చెబుతున్నాయని ఎంపికైన అభ్యర్ధులు వాపోతున్నారు.
అంతర్జాతీయంగా ఐటీ రంగంలో మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతన్న నేపధ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. వడ్డీరేట్ల పెంపు, మార్కెట్లలో లిక్విడిటీ తగ్గుదల, మాంద్యం పరిస్ధితులతో టెక్ స్టార్టప్ల నుంచి టెక్ దిగ్గజాల వరకూ ఐటీ కంపెనీలు గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల పరిస్ధితులతో పలు కంపెనీలు నియామకాలను నిలిపివేశాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్ధలు సైతం హైరింగ్ను నిలిపివేయడంతో పాటు అవసరమైతే లేఆఫ్స్ తప్పవనే సంకేతాలను పంపడం ఆందోళన రేకెత్తిస్తోంది.