భోపాల్ : 72 గంటల పాటు సమాధిలో గడిపిన మా భద్రకాళి విజయసన్ దర్బార్ వ్యవస్ధాపకుడు బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ తాను దుర్గా మాతను దర్శించానని చెప్పుకొచ్చారు. బాబాను చూసేందుకు వచ్చిన భక్తులు సమాధి వద్ద ఆయనకు హారతి ఇచ్చారు. సమాజ సంక్షేమం కోసం తాను సమాధిలోకి వెళ్లానని పురుషోత్తమానంద్ అన్నారు.
72 గంటల పాటు సమాధిలో ఉన్నా తాను బలహీనపడలేదని చెప్పారు. సమాధిలో తన శరీరం మాత్రమే నేలపై ఉందని, తన ఆత్మ భగవంతుడిపై లగ్నమైందని ఆయన చెప్పుకొచ్చారు. మరోసారి తాను 84 గంటల పాటు సమాధిలో ఉంటానని బాబా పురుషోత్తమానంద్ వెల్లడించారు.
సమాధిలోకి వెళ్లే ముందు తన తండ్రి పదిరోజుల పాటు ఆహారం ఏమీ తీసుకోలేదని కేవలం ద్రవాహారం తీసుకున్నారని బాబా కుమారుడు మిత్రేష్ కుమార్ వివరించారు. సమాధి కోసం బాబా నివాసం ఎదుట ఏడున్నర అడుగుల లోతున, నాలుగు అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడవైన గొయ్యి తవ్వారు. కాగా బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ సమాధిలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించినా ఆయన తాను అనుకున్న ప్రకారం సమాధి స్దితిని పూర్తిచేశారు.