తిరువనంతపురం : పదేండ్ల బాలికను రెండేండ్ల పాటు లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తి (41)కి కేరళలోని పధనంథిట్ట పోక్సో కోర్టు 142 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ 5 లక్షల జరిమానా విధించింది. నిందితుడు జరిమానా చెల్లించనిపక్షంలో మరో మూడేండ్లు జైలులో ఉండాలని కోర్టు ఆదేశించింది.
జిల్లాలో పోక్సో కేసులో విధించిన గరిష్ట శిక్ష ఇదే కావడం గమనార్హం. నిందితుడు పీఆర్ అలియాస్ బాబు 2019, 2021 మధ్య పదేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు తిరువల్ల పోలీసులు 2021 మార్చి 20న కేసు నమోదు చేశారు. బాలికకు బంధువైన బాబు ఆమె తల్లితండ్రులతో కలిసి అదే ఇంటిలో నివసించేవాడు.
ఆ సమయంలో బాలికను బాబు అత్యంత క్రూరంగా లైంగిక వేధింపులకు గురిచేశాడని తిరువల పోలీస్ ఇన్స్పెక్టర్ కేసు వివరాలను, దర్యాప్తు క్రమాన్ని వివరిస్తూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదోపవాదనల అనంతరం బాబుకు పోక్సో కోర్టు 142 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ 5 లక్షల జరిమానా విధించినట్టు జిల్లా పోలీసులు తెలిపారు.