బెంగళూరు, సెప్టెంబర్ 1: బీజేపీ నేతలకు దళితులంటే ఎంత చిన్న చూపో అద్దం పట్టే మరో ఘటన ఇది. మొన్నటికిమొన్న గుజరాత్లోని ఓ గ్రామంలో దళితులపై సామాజిక బహిష్కరణ విధించడం, నిన్న జార్ఖండ్లో ఓ గిరిజన యువతిని బీజేపీ నేత చిత్రహింసలు పెట్టిన ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా ఓ బీజేపీ మంత్రి.. ‘నీ కుటుంబం మొత్తాన్నీ నిప్పు పెట్టి కాల్చి చంపేస్తా’ అని ఓ దళితుడిని బెదిరించాడు. ఈ ఘటన బీజేపీపాలిత కర్ణాటకలోని హోస్పేట్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని ఓ గ్రామంలో ఓ వర్గం, పోలప్ప అనే దళితుడి మధ్య కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తున్నది. అయితే, మంగళవారం ఆ గ్రామంలో పర్యటించిన ఆ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆనంద్సింగ్ను పోలప్ప భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరాడు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. ‘నీ కుటుంబం మొత్తానికీ నిప్పు పెట్టి కాల్చి చంపేస్తా’ అని బెదిరింపులకు దిగాడు. భయపడ్డ బాధితుడు తన కుటుంబంతో కలిసి హాస్పెట్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి, పోలీస్ స్టేషన్ ఎదుటే కుటుంబంతో సహా నిప్పు పెట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వారిని రక్షించారు. బెదిరింపులకు దిగిన మంత్రిపై, సూసైడ్కు యత్నించిన బాధితులపై కేసు నమోదు చేశారు.