న్యూఢిల్లీ : రేషన్ దుకాణాల్లో ఇక ఆహార ధాన్యాలు పొందడంతో పాటు త్వరలో బ్యాంక్ లావాదేవీలూ నిర్వహించుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. రేషన్ దుకాణాన్ని కేంద్ర ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్గా గుర్తించి అందులో పనిచేసే సిబ్బందిని బ్యాంక్ అనుబంధ సిబ్బందిగా ఆమోదించిందని ఆహార శాఖ వర్గాలు తెలిపారు.
ఈ వ్యవస్ధను త్వరలో ప్రవేశపెట్టేందుకు చొరవ చూపాలని కోరుతూ ఆహార ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్ధను బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నూతన వ్యవస్ధను ఏర్పాటు చేయడంలో రేషన్ దుకాణాలకు బ్యాంకులు ఏ విధంగా సాయం చేయాలి, ఎంత కమిషన్ చెల్లించాలనే అంశాలపై చర్చించేందుకు రేషన్ దుకాణాల సంఘాల నేతలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులతో ఈ దిశగా సంప్రదింపులు జరిగాయి. త్వరలోనే రేషన్ దుకాణాల్లో బ్యాంకింగ్ లావాదేవీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.