ఇటీవల దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలు (డ్రగ్స్) విరివిగా పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా యువత మద్యం, మత్తుమందులతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నది. ఈ సంస్కృతి పల్లె నుంచి పట్టణం వరకూ పాకటం పెద్ద విషాదం. ఇలాంటి సామాజిక వికృతాలు ఓ వైపుంటే..మరోవైపు చిన్నారులు స్మార్ట్ఫోన్లకు బానిసలవుతుండటం ఆందోళనకరం.
యువతతో పాటు పిల్లలు కూడా ఆన్లైన్లో ఆటలాడుతూ యదార్థ జీవితాలను, కుటుంబ, స్నేహ సంబంధాలను వదిలిపెట్టి ఫాంటసీ జీవితాన్ని గడుపుతున్నారు. సెల్లుఫోన్ లేకుండా ఉండ లేని స్థితికి చేరుకుంటున్నారు. సెల్ఫోన్కు బానిసలై మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుశోకం మిగిలిస్తున్నారు. ఈ క్రమంలోనే యువత తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్నది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్నారు మన పెద్దలు. కానీ యువత మత్తుకు అలవాటు పడి ఉజ్వలమైన భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటున్నది.
యునెస్కో నివేదిక ప్రకారం.. సెల్ఫోన్కు బానిస లై.. 10-19 ఏండ్ల వయస్సున్న చిన్నారులు, యువత ఏటా 45,800 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి 11 నిమిషాలకు ఒకరు బలవన్మరణం అవుతున్నారు. చిన్నారుల ఆత్మహత్యకు కారణం.. ఆన్లైన్ ఆటల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ ఆటల్లో 90 శాతం హింసను ప్రేరేపించేవిగా ఉంటున్నాయి. మరోవైపు అశ్లీలత కూడా యువతను తీవ్ర మానసిక రుగ్మతలకు గురిచేస్తున్నది. పబ్జీ, బ్లూవేల్ వంటి ఆటలు విపరీతంగా ఆడుతూ పిల్లలు పరిసరాలను మరిచిపోతున్నారు. తిండి, నిద్రాహారాలు మాని ఆటల్లో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే యువతలో ఆందోళన, చిరాకు, కోపం, అసహనం, హింసాత్మక నైజం పెరిగిపోతున్నది. అఘాయిత్యాలూ రోజురోజుకు పెచ్చరిల్లిపోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మగపిల్లల్లో 12 శాతం, బాలికల్లో 7 శాతం ఈ ఆన్లైన్ ఆటలకు అలవాటుపడ్డారని పలు నివేదికలు చెప్తున్నాయి. కరోనా కాలంలో పెద్దలకు, చిన్నారులకు ఏ విధమైన పని, పాఠశాలలు లేక ఈ ఆటలకు బానిసలైపోయారు. 2021 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 431 మిలియన్ల మంది ఈ ఆటలకు బానిసలయ్యారు. ఈ ఆన్లైన్ ఆటల్లో చైనా అగ్రస్థానంలో కొనసాగితే, మన దేశం రెండవ స్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఏటా రూ.13,600 కోట్ల ఈ ఆన్లైన్ ఆటల వ్యాపా రం జరుగుతున్నదంటే దాని ప్రభావం ఎంత ఉందో ఊహించుకోవచ్చు.
తల్లిదండ్రులు ఈ సామాజిక సమస్యపై తీవ్రంగా ఆలోచించాలి. పిల్లల ఆలోచనలు, వైఖరులు, అలవాట్లపై దృష్టిసారించాలి. ప్రపంచవ్యాప్తంగా 7.3 బిలియన్ల ఆటలను ఇన్స్టాల్ చేసుకోగా, మన దేశ వినియోగదారుల వాటా 17 శాతం ఉండటం గమనార్హం. ఈ ఆటలు ఆడేవారిలో 60 శాతం మంది 25 ఏండ్ల లోపువారే. సగటున రోజుకు 4 గంటలు ఈ ఆటలు ఆడుతున్నారు. అంతేకాకుండా ఎంతో విలువైన కాలం వృథా అవుతున్నది. కానీ పలు కంపెనీలు మాత్రం లెక్కకు మించి లాభాలు గడిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ ఆన్లైన్ ఆటల తయారీలో సోనీ, టెన్సెం ట్, మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలున్నా యి. మన దేశంలో టీసీయస్, ఇన్ఫోసిస్ వంటి ప్రఖ్యా త సంస్థలు భాగస్వాములుగా ఉండటం గమనార్హం.
ఇంతటి తీవ్రమైన సామాజిక సమస్యగా మారిన ఆన్లైన్ ఆటలతో 2020 ఆగస్టు నుంచి 6 నెలల వ్యవధిలో ఈ ఆటల ద్వారా ప్రభుత్వానికి 544 మిలియన్ల డాలర్ల ఆదాయం సమకూరింది. ఈ ఆన్లైన్ ఆటలు ఆడేవారిపై, తయారీ సంస్థలపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. మన దేశం కూడా బ్రిటన్ను అనుసరిస్తే మంచిది.
ఆన్లైన్ ఆటల పరిస్థితి ఇంత తీవ్రం గా ఉంటే.. బాధ్యత అంతా తల్లిదండ్రులదే అంటూ ఆన్లైన్ ఆటల తయారీ సంస్థలు తప్పించుకుంటుండటం విస్మయానికి గురిచేస్తున్నది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితుల వలె మంచి సలహాలిస్తూ, వారి అలవాట్లు, అభిరుచులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. వారికి మంచి భవిష్యత్తును అందించేవిధంగా అండగా నిలబడాలి. అప్పుడే దేశంలోని యువత సన్మార్గంలో నడుస్తుంది.
ఐ.ప్రసాదరావు
99482 72919