Demand High for Homes | తక్కువ వడ్డీరేట్లకు ఇంటి రుణాలు.. ఐటీ అనుబంధ రంగాల్లో పెరుగుతున్న ఉద్యోగావకాశాలు ఇండ్ల కొనుగోలుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రెట్టింపుకు పైగా ఇండ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇది ప్రీ-కోవిడ్ నాటి పరిస్థితులకు చేరుతుందనడానికి నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు.
ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సంస్థ అన్రాక్ సర్వే ప్రకారం 2020-21 ద్వితీయ త్రైమాసికంలో 29,520 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కరోనాకు ముందు 2019-20 ద్వితీయ త్రైమాసికంలో 55,080 ఇండ్లు అమ్ముడు పోయాయి. అదే 2018-19లో 52,130 మంది ఇండ్లను కొనుగోలు చేశారని అన్రాక్ వివరించింది.
గతేడాదితో పోలిస్తే 2021లో ఇండ్ల విక్రయాలు 30 శాతం పెరుగుతాయని అన్రాక్ అంచనా వేసింది. గతేడాది (2020-21)లో 1.38,344 ఇండ్లు అమ్ముడయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 1,79,527 యూనిట్లకు చేరుతుందని అంచనా. కరోనాకు ముందు 2019-20లో 2,61,358 ఇండ్లు అమ్ముడయ్యాయి.
గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇండ్ల ధరలు మూడు శాతం పెరిగాయి. 2020లో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) ధర రూ.5,600 ఉంటే, ఈ ఏడాది అది రూ.5,760లకు చేరుకుంది.
ఐటీ, అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న వర్గాల నుంచి సొంతింటికి గిరాకీ పెరిగింది. ఉద్యోగ భద్రతతోపాటు చౌక వడ్డీరేట్లు కూడా ఇండ్ల డిమాండ్ పెరుగడానికి కారణాలు. సొంతింటిని కొనుగోలు చేయాలన్న సెంటిమెంట్ బలోపేతం అవుతున్నది. ఇక కరోనాతో దూసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం కల్చర్ కూడా ప్రజానీకం పెద్ద ఇండ్ల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా పెరిగింది.