కోల్కతా: పశ్చిమ బెంగాల్కు సేవ చేయడానికే తన నిర్ణయాన్ని మార్చుకున్నానని బాబుల్ సుప్రియో తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నందుకు చాలా గర్వపడుతున్నట్లు ఆయన చెప్పారు. బెంగాల్కు సేవ చేసే గొప్ప అవకాశం కోసం తిరిగి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. బీజేపీ మాజీ నేత, మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో శనివారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్యసభ సభ్యుడు ఓబ్రెయిన్ సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించి పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు తన హృదయం నుంచి వచ్చిన ఆవేదనను అర్థం చేసుకుని రాజకీయాలను వీడుతానని చెప్పినట్లు బాబుల్ సుప్రియో గుర్తు చేశారు. అయితే రాజకీయాలను విడిచిపెట్టాలనే నా నిర్ణయం తప్పు, భావోద్వేగమని నాడు తన స్నేహితులంతా చెప్పారని అన్నారు. దీంతో టీఎంసీలో చేరడం బెంగాల్కు సేవ చేయడానికి గొప్ప అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. దీదీ, అభిషేక్ తనకు గొప్ప అవకాశం ఇచ్చారని చెప్పారు.
పార్టీలో తనకు ఘన స్వాగతం లభించిదన్న సుప్రియో, టీఎంసీ అధినేత్రి, సీఎం మమతను సోమవారం కలుస్తానని చెప్పారు. తాను టీఎంసీలో చేరినందున బీజేపీ తరుఫున గెలిచిన అసన్సోల్ సీటును పట్టుకుని వేలాడాల్సిన పనిలేదన్నారు. అసన్సోల్ కారణంగానే రాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన సాధ్యమైనంత వరకు ఆ నియోజకవర్గం కోసం పని చేస్తానని వెల్లడించారు.