హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉన్నది. అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడన్న కారణంతో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ అనూరాధా సంతకాలతో అపెక్స్ కౌన్సిల్ అజార్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ప్రస్తుతం హెచ్సీఏ అధ్యక్షుడిగా తానే కొనసాగుతానని, ‘అక్రమ’ అపెక్స్ కౌన్సిల్ తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం లేదని అజారుద్దీన్ పునరుద్ఘాటించారు. హెచ్సీఏ రాజ్యాంగాన్ని కమిటీ సభ్యులు ఖూనీ చేస్తున్నారు. అడ్డుకున్న నాపై బురద జల్లాలని చూస్తున్నారని అజార్ మండిపడ్డారు. అసోసియేషన్లో జరుగుతున్న పరిణామాలపై అజారుద్దీన్ జింఖానా గ్రౌండ్స్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
నాకు అన్ని రకాల అధికారులు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలపై బీసీసీఐకి సమాచారం ఇచ్చాను. ఇలాంటి వాటికి నేను భయపడేది లేదు. అపెక్స్ కౌన్సిల్లో 9 మంది ఉంటే అందులో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడి, తాము చేసిందే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. కమిటీలోని కొంతమంది సభ్యులు అవినీతికి పాల్పడ్డారు. ఆ ఐదుగురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ల అవినీతికి నేను అడ్డుపడుతున్నాననే కారణంతో వీళ్లు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 25ఏండ్లుగా నేను క్రికెట్కు సేవలందిస్తున్నాను. గత 30 ఏళ్లుగా హెచ్సీఏపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ గురించి తెలియని వాళ్లు అనేక ఆరోపణలు చేస్తున్నారు.
గతంలో అధ్యక్షుడిగా, పాలకులుగా ఉన్నవారు మిగతా చోట్ల ఎందుకు క్రికెట్ మైదానాలకు ఏర్పాటు చేయలేకపోయారు. 4కోట్లు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేశాం. ఉప్పల్ గ్రౌండ్లో నాసిరకం పనుల వల్ల చెడ్డపేరు మూటగట్టుకుంది. అండర్-19 ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తే నాపై ఆరోపణలు చేశారు. ఓ క్రికెటర్గా నేను ప్లేయర్స్తో మాట్లాడొద్దా? క్లబ్ సెక్రటరీలతో ఎలాంటి విభేదాలు లేవు. కోర్టు గైడ్లైన్స్ ప్రకారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశాను. దుబాయ్లో క్రికెట్ క్లబ్కు మెంటార్గా ఉన్నా కానీ, నేను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. బీసీసీఐకి ఇవన్నీ స్పష్టంగా తెలుసు.
నేను ఎలాంటి బ్లాక్మెయిల్స్కు భయపడను. దీపక్ వర్మను అంబుడ్స్మన్గా నియమించుకున్నాం. అందరూ అంగీకారం తెలిపారు. కానీ, 10 నిమిషాల్లోనే నేను లేకుండా మరో మీటింగ్ పెట్టుకొని దీపక్ వర్మ నియామకం చెల్లదు అని నిర్ణయం తీసుకున్నారు. హెచ్సీఏలో ఏం జరుగుతుందో బీసీసీఐకి అన్నీ తెలుసు. ఈ విషయంపై నేను కూడా బీసీసీఐకి వివరిస్తాను. అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు ఇప్పటికే అంబుడ్స్మన్ నుంచి నోటీసులు వెళ్లాయని అజార్ పేర్కొన్నారు.