చండీగఢ్: టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ను పంజాబ్కు ఆహ్వానిస్తానని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు అన్నారు. లూథియానాలో అతిపెద్ద విద్యుత్ వాహన పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన పంజాబ్ మోడల్ గురించి మీడియాతో ఆయన మాట్లాడారు. 10 పారిశ్రామిక, 13 ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను లక్ష్యంగా చేసుకుని పంజాబ్ మోడల్ను రూపొందించినట్లు తెలిపారు. మొహాలీని ఐటీ హబ్, స్టార్టప్ సిటీగా మారుస్తామని చెప్పారు. మొహాలీని ఉత్తర భారత సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్నారు.
కాగా, సీఎం అభ్యర్థిని నిర్ణయించేందుకు హైకమాండ్ ఉందని సిద్ధూ అన్నారు. తాను ఏ పదవి కోసం పంజాబ్ మోడల్ను తయారు చేయలేదని చెప్పారు. తాను ఎప్పుడూ కూడా పంజాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటానని అన్నారు. పంజాబ్ తన ఫ్యాషన్ అని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడమే తన ఉద్దేశమని తెలిపారు.
మరోవైపు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉపాధి అనేది అత్యంత కీలకమని సిద్ధూ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో స్కిల్ ఓరియెంటెడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ను రూపొందించి, క్రీడలకు దానిని అనుసంధానం చేస్తామని తెలిపారు. పంజాబ్ మోడల్ మన్మోహన్ సింగ్ అభివృద్ధికి స్ఫూర్తి అని పేర్కొన్నారు.