న్యూఢిల్లీ : దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ నిలిచింది. గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను ప్రకటించారు. ఆరో ఎడిషన్లో ఎనిమిది ఐఐటీలు, రెండు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు దేశంలోని మొదటి పది ఇంజినీరింగ్ సంస్థల్లో చోటు దక్కించుకున్నాయి. టాప్ టెన్ జాబితాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువాహటి మూడు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలోని జేఎన్యూ తొమ్మిది, బెనారస్ హిందూ యూరివర్సిటీ పదో ర్యాంకు సాధించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) అహ్మదాబాద్ ఉత్తమ బీ-స్కూల్గా నిలిచింది. అయితే, ఫార్మసీలో జామియా హమ్దార్డ్ అగ్రస్థానంలో నిలిచింది.
కళాశాలల కేటగిరిలో ఢిల్లీలోని మిరాండా హౌస్ మొదటి ర్యాంక్ సాధించింది. కళాశాలల కేటగిరీలో ఢిల్లీలోని మిరాండా హౌస్ మొదటి ర్యాంక్ సాధించింది. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ అండ్ లయోలా కాలేజ్ చెన్నై తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం.. ఎయిమ్స్ ఢిల్లీ వైద్య కళాశాలల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పీజీఐఎంఈఆర్ చండీగఢ్, వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.