హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్(ఐఐఎస్ఈఆర్) డైరెక్టర్ డాక్టర్ కేవీ రమణాచార్య(68) ఇక లేరు. శుక్రవారం మాల్దీవుల్లో ఉన్న ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దేశంలోని ప్రతిభావంతులైన శాస్త్రవేత్తల్లో ఒకరైన రమణాచార్య ఒడిశా రాష్ట్రం బరంపురంలోని ఐఐఎస్ఈఆర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్ఈఆర్ సంస్థకు ప్రథమ డైరెక్టర్గా నియమించింది. మంచి పరిపాలనాదక్షుడైన రమణాచార్య ఐఐఎస్ఈఆర్ రూప కల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు. రమణాచార్య స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి.
ఆయన 1954 ఫిబ్రవరి 10న జన్మించారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే సాగింది. 1983లో ఓయూ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. వివిధ సాంకేతిక అంశాలపై 130కిపైగా వ్యాసాలు రాశారు. ప్రొఫెసర్ గిర్జేశ్ గోవిట్తో కలిసి 2008లో రచించిన ‘బయోలాజికల్ సిస్టమ్స్’ అనే గ్రంథం మంచి ఆదరణ పొందింది. 2010-12 మధ్యకాలంలో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీకి చైర్మన్గా వ్యవహరించారు. 2012-14లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇన్ బయోలాజికల్ సిస్టమ్స్కు చైర్మన్గా పనిచేశారు. 1986లో ప్రతిష్ఠాత్మక బ్రూకర్ యంగ్ సైంటిస్ట్ పురస్కారాన్ని అందుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 మంది పీహెచ్డీ విద్యార్థులకు పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. రమణాచార్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమణాచార్య భౌతికకాయానికి ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రమణాచార్య హఠాన్మరణం పట్ల పలువురు శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.