కరైకాల్: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అక్కడ ప్రచార జోరు పెంచాయి. ఇటీవల విశ్వాసపరీక్షలో ఓడిపోయి నారాయణస్వామి సర్కారు కుప్పకూలడంతో పోయిన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ కసితో పనిచేస్తుండగా, ఈసారి పుదుచ్చేరిలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. అందులోభాగంగానే ఇవాళ పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చారు.
కరైకాల్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే కూటమికే అధికారం కట్టబెట్టబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయేను గెలిపిస్తే పుదుచ్చేరిలో 75 శాతంగా ఉన్న నిరుద్యోగితను 40 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు మంత్రిత్వ శాఖ లేదంటూ ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ చేసిన విమర్శలను అమిత్ షా ప్రస్తావించారు. మత్స్యకారులకు మంత్రిత్వ శాఖ ఏర్పాటై రెండేండ్లయినా రాహుల్గాంధీ తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అమిత్ షా ఎద్దేవా చేశారు.