ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్ : హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్యాస్ సిలిండర ధర మరో రూ.200 పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, అంటే గ్యాస్ సిలిండర్ ధర 1200 అయితదని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఏడాదిలో గ్యాస్ సిలిండర్ ధర రూ.2వేలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. భవిష్యత్తులో గ్యాస్ ధరలు పెంచబోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్గానీ, ఆయన తరఫున ప్రచారానికి వచ్చే ఆ పార్టీ పెద్దలుగానీ హామీ ఇవ్వగలరా? అని హరీశ్రావు ప్రశ్నించారు.
ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో సోమవారం నిర్వహించిన ధూంధాం కార్యక్రమానికి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, పాడి కౌశిక్రెడ్డితో కలిసి హరీశ్రావు ముఖ్య అతిథి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. మొండి, తొండి, ఝూఠా మాటలకు పెట్టింది పేరు బీజేపీ అని విమర్శించారు.
ఎన్నికల ప్రచారానికి వస్తున్న బీజేపీ నాయకులు పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరల గురించి మాట్లాడరని, కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాల ఊసెత్తరని మండిపడ్డారు. ఈటల రాజేందర్ ఏ సభపెట్టినా హుజూరాబాద్ ప్రజలకోసం ఏంచేస్తాడో చెప్పకుండా ఆయనను ఆదరించిన టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని ధ్వజమెత్తారు.టీఆర్ఎస్ అంటే సంక్షేమం, అభివృద్ధి అని మంత్రి హరీశ్రావు తెలిపారు.
వృద్ధులకు సీఎం కేసీఆర్ కన్నకొడుకోలె నెలకు రూ. 2వేల పింఛన్ ఇస్తున్నారని చెప్పారు. అలాగే, త్వరలోనే 57 ఏండ్లు నిండినవారందరికీ పింఛన్ ఇస్తామని, ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద రూ. లక్షా 116 ఇస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అయిన మహిళలకు కేసీఆర్ కిట్, డబ్బులు అందజేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనలాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం నీళ్లు వచ్చేవా?…బావులు పైకి ఉబికి వచ్చేవా..? కాలువల్లో నీళ్లు పారేవా..? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రూ. 25 వేల వరకు రైతు రుణమాఫీ చేశామని, రూ. 50 వేల వరకు కూడా పూర్తికావచ్చిందని, మిగతాది మిత్తితో సహా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత నెలకు 2సార్లు హుజూరాబాద్ వస్తానని, దగ్గరుండి సమాఖ్య భవనాలు కట్టిస్తానని పేర్కొన్నారు.
బీజేపీకి ఓటేస్తే వ్యవసాయ బావులకు మీటర్లు వస్తాయని, ఎరువుల ధరలు పెరుగుతాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజలను సతాయిస్తున్న బీజేపీలో ఈటల రాజేందర్ చేరాడని చెప్పారు. అసలు ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశాడో సరైన కారణం చెప్పాడా అని ప్రజలను ప్రశ్నించారు. హుజూరాబాద్ జిల్లా కావాలని చేశాడా?.. జమ్మికుంటకు మెడికల్ కాలేజీ కావాలని చేశాడా? అని ప్రశ్నించారు. కేవలం తన స్వార్థం కోసం మాత్రమే ఈటల రాజీనామా చేశాడని మండిపడ్డారు.
ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని, గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలిస్తే హుజూరాబాద్కు లాభమని వెల్లడించారు. ముద్దసాని దామోదర్రెడ్డి మీద పోటీ చేసినప్పుడు ఈటల రాజేందర్ ఎవరికి తెలుసు?.. అప్పుడు గులాబీ పార్టీ ఈటలను గెలిపించిందని హరీశ్రావు అన్నారు. ఈటల రాకముందు కూడా టీఆర్ఎస్ గెలిచిందని, ఆయన పోయాకకూడా గెలుస్తుందని అన్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి నడిమిట్ల వచ్చిండు, నడిమిట్లనే పోయిండని హరీశ్రావు పేర్కొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తనను పిరికిపందా అని అంటున్నారని, ఎవరు పిరికిపందనో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి తాను పోరాడానని, కిషన్రెడ్డి పారిపోయిన పిరికిపందా అని గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. ఉద్యమంలో తనపై 130 కేసులు నమోదుయ్యాయని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ పులిబిడ్డ ఎట్లా అవుతడో కిషన్రెడ్డి తెలుపాలని డిమాండ్ చేశారు.
బీజేపీ చెప్పే అబద్ధపు మాటలు ప్రజలు నమ్మవద్దని, ఏ పార్టీతో మనకు భవిష్యత్ ఉంటదో ఆలోచన చేయాలని గెల్లు శ్రీనివాస్యాదవ్ ప్రజలను కోరారు. ఏప్రిల్ 30న ఈటల రాజేందర్ ఏమన్నడు.. 6 లక్షలకు ఎకరం కొన్నా అన్నారు. .సిరిసేడులో అయినా అంత తక్కువ ధరలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మాసాయిపేటలో పేదల భూములను ఈటల రాజేందర్ లాక్కుంటే, వారంతా కలిసి సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారని, సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారని తెలిపారు. ఎట్లా 6 లక్షలకు ఎకరం భూమి కొన్నవో చెప్తావా రాజేందర్? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్తో 5సంవత్సరాల నుంచి గ్యాప్ వచ్చిందని ఈటల అంటున్నాడని,. మరి గ్యాప్ వస్తే సీఎం కేసీఆర్ నీకు మళ్ల ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఎట్లా ఇచ్చారు..? మంత్రిని ఎలా చేశారు? అని గెల్లు శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలని, కూల్చాలని ఈటల కుట్రలు చేశాడని, ఈటల ఓ కుట్ర దారుడని మండిపడ్డారు. 4వేల ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టలేదని, ఆయనకు పేదల పట్ల ప్రేమలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పేదింటి బిడ్డనైన తనను ఓడించడానికి కేంద్ర మంత్రులు రావడం విడ్డూరంగా ఉందని గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. తాను పేదింటి బిడ్డనని, గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్తో మాట్లాడి 5వేల ఇండ్లు తేవడంతో పాటు ఒక మెడికల్ కాలేజీని తెస్తానని చెప్పారు. ఇది తాను మాత్రమే చేస్తానని, ఈటల రాజేందర్ చేయలేరన్నారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ ఫోన్ చేసినా వచ్చి సేవ చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎండీ రఫీఖాన్, కలాల రాజిరెడ్డి, రాంమల్లయ్య, తిరుపతిరెడ్డి, మానస, ఎంపీటీసీలు ఎక్కటి సంజీవరెడ్డి, మోటపోతుల ఐలయ్య, చిన్నరాయుడు, మాజీ సర్పంచ్ బుర రమేశ్, టీఆర్ఎస్ నాయకులు వాసు, ముస్తఫా, మురళీ, తారక్, మహిపాల్, చంద్రమౌళి, రాజశేఖర్, శ్రీపాల్రెడ్డి, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.