National Flag | రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను హెచ్ఐసీసీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆగస్టు 15వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జండాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. జాతీయ జెండాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలిద్దాం. ఫ్లాగ్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష కూడా విధించొచ్చు.
-జాతీయ జెండా ఎగురవేసినప్పుడు కాషాయ వర్ణం పైకి వచ్చేలా జాగ్రత్త తీసుకోవాలి.
-జాతీయ జెండాను పై నుంచి కిందకు వేలాడదీయకూడదు.
-జాతీయ జెండాకు సమానంగా కానీ, ఇంకా ఎత్తులో కానీ ఏ జెండా ఎగురకూడదు.
-జాతీయ జెండా పై ఏదైనా రాయడం, జెండాతో ఏదైనా తయారు చేయడం లేదా జెండా నుంచి ఏదైనా తొలగించడం చట్ట విరుద్ధం.
-జాతీయ పతాకాన్ని ఏ వస్తువులను, భవనాలను మొదలైన వాటిని కవర్ చేయడానికి ఉపయోగించొద్దు.
-జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా నేలపై లేదా నీటిలో లేదా కాలి బాటలో వేయరాదు.
-జాతీయ పతాకాన్ని ఏ విధమైన యూనిఫాం లేదా అలంకరణ కోసం ఉపయోగించొద్దు.
-జాతీయ జెండాకు హానీ కలిగించే విధంగా దాన్ని ప్రదర్శించొద్దు, కట్టొద్దు.
-జాతీయ జెండాను పోల్ కర్ర చిట్టచివరనే ఎగురవేయాలి. సగం కిందకు దించి ఎగురవేయకూడదు.
-దెబ్బతిన్న లేదా చెదిరిన జెండాను ప్రదర్శించకూడదు.