కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి మమతాబెనర్జి అన్నీ తానై ముందుకు సాగుతున్నారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా తనవంతు కృషి చేస్తున్నారు.
ఇవాళ తన సొంత నియోజకవర్గం నందిగ్రామ్లో మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్న ఆమె తన నామినేషన్ దాఖలుకు ఒక్కరోజు ముందు తన నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడి ప్రజలను ఉద్దేశించి కొన్ని భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాను నామినేషన్ వేయాలనుకుంటున్నానని, మీరు వద్దంటే తాను నామినేషన్ వేయబోనని చెప్పారు. మీరు నన్ను మీ బిడ్డగా పరిగణించి మరోసారి ఆశీర్వదిస్తామంటేనే నామినేషన్ దాఖలు చేస్తానని ప్రజల నుంచి హామీ తీసుకున్నారు.