హైదరాబాద్ : దయచేసి మరోసారి తెలంగాణకు వచ్చినప్పుడు సరైన హోం వర్క్ చేసుకొని రావాలని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. సీఎం కేసీఆర్పై హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సీఎం బిస్వా శర్మ ఇంతకుముందు మీ ఉపన్యాసం చూశాను. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదన్నారు. 2014 నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారని తెలిపారు.
కర్రు కాల్చి వాత పెట్టినా..
2018 ఎన్నికల్లో ఇలాగే విర్రవీగుతూ మాట్లాడిన మీ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి, 107 స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ఎజెండా.
ఆ దిశగా బంగారు తెలంగాణ వైపు పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లక్ష 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు డైరెక్టుగా కల్పించామన్నారు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది ప్రైవేటు ఉద్యోగాలు కల్పించి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
మీరు సృష్టించిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ?
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇప్పటికీ ఎనిమిది ఏండ్లు కావస్తోంది. మీరు సృష్టించిన 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ? అని సూటిగా ప్రశ్నించారు.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సంస్థ ప్రకారం, భారత్లో నిరుద్యోగిత రేటు డిసెంబర్లో దాదాపు 8 శాతానికి పెరిగింది. బంగ్లాదేశ్ (5.3 %), మెక్సికో (4.7 %), వియత్నాం (2.3 %) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా భారత్లో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ పథకాలను కాపీ కొడుతూ..
దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన రైతుబంధు, కల్యాణలక్ష్మి ,మిషన్ భగీరథ, నేడు దేశ వ్యాప్తంగా వివిధ రకాల పేర్లతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు.