బీజేపీ మ్యానిఫెస్టో చూడుండ్రి.. పిల్లలకు ఉద్యోగాలిస్తరట. మోదీ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నరు. అధికారంలోకి వచ్చి ఏడేండ్లు అయ్యింది. మరి ఎక్కడ ఆ 2 కోట్ల ఉద్యోగాలు? కరీంనగర్ నుంచి వరంగల్కు రైల్వే లైన్ మంజూరైతే ఖతం చేసింది బీజేపీ కాదా? రైతులకు 3 వేల పింఛన్ ఇస్తామంటున్నరు. గుజరాత్లో పింఛను రూ.600 కూడా ఇస్తలేరు. ఇక్కడ ఎట్ల ఇస్తరు తరుణ్చుగ్?
-మంత్రి హరీశ్రావు
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్, హుజూరాబాద్ రూరల్ అక్టోబర్ 26: ‘గుజరాత్లో రూ.600 పింఛన్ ఇయ్యనోళ్లు హుజూరాబాద్లో మాత్రం రూ.3వేలు ఇస్తరట. అక్కడ ఇయ్యనోళ్లు ఇక్కడ ఇస్తరా? గీ బీజేపీ మ్యానిఫెస్టో చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్థమైతలే’ అని ఆర్థికమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. అన్ని సర్వేల్లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని తెల్వడంతో ఓడిపోతామనే భయంతో బీజేపీవాళ్లు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలో నిర్వహించిన ధూంధాంకు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్, మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. దెబ్బలు కొట్టిండనో, షుగర్ వచ్చిందనో పడిపోతే రెండు ఓట్లు పడుతాయని చూస్తున్నారని అన్నారు. వాళ్లపై వాళ్లే రాళ్లు వేసుకుని అయ్యో పాపమని యాక్టింగ్ చేస్తారని హెచ్చరించారు. గతంలో కరీంనగర్ ఓట్లప్పుడు బండి సంజయ్ అట్లనే పడిపోయి దవాఖానలో చేరి, ఓట్లు కాగానే మంచిగా లేచాడని గుర్తుచేశారు. ఇ లాంటి నాటకాలు నమ్మొద్దని, మొసలి కన్నీళ్లకు మోసపోవద్దని కోరారు. ‘30న ఓటు వేయడానికి వెళ్లేముందు సిలిండర్కు దండం పెట్టి.. కారు గుర్తుకు ఓటేసి బీజేపీని బొంద పెట్టాలి’ అని పిలుపునిచ్చారు.
బీజేపీ మ్యానిఫెస్టో ఒక జోక్
హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం బీజేపీ విడుదలచేసిన మ్యానిఫెస్టో జోక్ లెక్క ఉన్నదని హరీశ్ ఎద్దేవాచేశారు. ‘అసలు ఈ ప్రాంతంపై కనీస అవగాహన లేకుండా దాన్ని తయారుచేసుడు చూస్తే నవ్వు ఆగుతలేదు. కరీంనగర్-వరంగల్ రైల్వే లైన్ను ఖతం చేసినోళ్లు జమ్మికుంట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తరట! నాలుగేండ్ల కిందటనే మిషన్ భగీరథ ద్వారా సీఎం కేసీఆర్ ఇంటింటికీ నీళ్లిస్తే.. వీళ్లు ఇప్పుడు ఇస్తమంటున్నరు! ఇంతకన్నా జోక్ ఉంటదా? ఆ విషయం కూడా బీజేపోళ్లకు తెల్వకపోవటం విచారకరం. ఇగ, పిల్లలకు ఉద్యోగాలిస్తరట! మోదీ అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నరు. ఇప్పటికి ఏడేండ్లు గడిచిపాయే. ఎక్కడ ఆ 2 కోట్ల ఉద్యోగాలు?’ అని మంత్రి హరీశ్ తనదైన శైలిలో బీజేపీని విమర్శించారు. ధరలు పెంచే వాళ్లు కావాలో, పేదలకు మేలు చేసే పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించాలని అన్నారు.
మేం చేశాం.. చేస్తాం
రూ.200 పింఛన్ను రూ.2వేలు చేస్తామని అధికారంలోకి రాకముందు చెప్పి, చేశామని హరీశ్రావు చెప్పారు. అన్ని కులాల్లోని పేదలకు దళితబంధు తరహా పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు. రైతన్నలకు 24 గంటల కరెంటు ఇస్తున్నమని, కాళేశ్వరం నీళ్లతో పంటలు పండించుకుంటున్నారని చెప్పారు. భూమి శిస్తు, నీటి తీరువాలు అన్నీ రద్దు చేసి సీఎం కేసీఆర్ రైతుబంధు అందిస్తున్నారని గుర్తుచేశారు. రైతు చనిపోతే బీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నమని తెలిపారు. 57 ఏండ్లకే ఆసరా పింఛన్ త్వరలో మొదలవుతుందని, ఉగాది నాటికి రూ.లక్షలోపు వ్యవసాయ రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తే హుజూరాబాద్లో 5వేల ఇండ్లు కడుతామని, సొంత జాగా ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5.04 లక్షలు ఇస్తామని తెలిపారు.
నన్ను తిట్టడమే వాళ్ల పని
బీజేపీ వాళ్లు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్న హరీశ్రావు.. తిట్టడం మానేసి, మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, కూరగాయలు, వంటనూనెల ధరలు పెంచారని, ఇంకా బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. మహిళలకు చెల్లని చెక్కులు ఇచ్చామని ఈటల అబద్ధాలు చెబుతున్నాడన్న హరీశ్రావు.. ఇంత ఝుఠా మాటలు మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు. చెక్కు చెల్లితే ఈటలను ఓడగొట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు.
శ్రీమంతుడు ఈటలకు పేదలు పట్టరు
‘కేసీఆర్ కిట్ పనికి రాదట.. రైతుబంధు దండగట.. ఆసరా పెన్షన్లు పరిగె ఏరుకున్నట్లు అంటున్న నీవు శ్రీమంతుడు కావచ్చు. నీకు అవసరం లేకపోవచ్చు. ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు అవ్వకు కొండంత అండ వచ్చింది. పింఛన్లతో ఆత్మవిశ్వాసం కలిగింది’ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్ మండలం సింగాపూర్, మాలపల్లి గ్రామాల్లో రోడ్షో సందర్భంగా ఆయా చోట్ల హరీశ్రావు మాట్లాడారు. శ్రీమంతుడు ఈటల రాజేందర్కు పేదలు పట్టని ఆయన ఎద్దేవాచేశారు.
ఏ పార్టీకి ఓటేస్తే లాభమో ఆలోచించాలి: గెల్లు
ఉప ఎన్నికలో ఏ పార్టీకి ఓటేస్తే ప్రజలకు లాభం జరుగుతదో ఆలోచించి ఓటు వేయాలని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ కోరారు. 2001 నుంచి ఉద్యమంలో ఉన్నానని, నిరుపేదనైనా తనను సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపారని అన్నారు. ఉద్యమంలో ఎన్నో దెబ్బలు తిన్నానని, ఎన్నో కేసులైనా ఉద్యమాన్ని విడిచిపెట్టలేదని, అదే స్ఫూర్తితో హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. భూముల కబ్జాను పక్కదారి పట్టించేందుకే ఈటల రాజీనామా చేశాడని ఆరోపించారు. ప్రజలంతా కబ్జాదారునికి మద్దతిస్తారా? ఉద్యమకారునికి మద్దతిస్తారా? ఆలోచించాలని అన్నారు.
ఈటల ఇది సమంజసమేనా?: మంత్రి శ్రీనివాస్గౌడ్
పెంచి పెద్ద చేసి, మంత్రి పదవి ఇచ్చిన తండ్రి లాంటి సీఎం కేసీఆర్ను తిట్టడం ఎంతవరకు సమంజసమని ఈటలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం చేసింది కేసీఆర్ ఒక్కరేనని అన్నారు.
3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్లా
ఈటల రాజీనామా చేశాక ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. ప్రచారం ముగిశాఖ తామంతా స్వస్థలాలకు వెళ్లిపోతామని, ఇక ప్రజలే రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు.