ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో శివసేన చీలికదశలో ఉండగా ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన తర్వాత కీలకంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) తన వైఖరిని స్పష్టం చేసింది.
తమ పార్టీ అధికారంలో ఉండేందుకు బీజేపీతో జతకట్టబోమని ఎన్సీపీ మంత్రి జయంత్ పాటిల్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వంపై స్పష్టత ఇచ్చారు. ‘ఎంవీఏ కూటమి ప్రభుత్వం ఉంటే అధికారంలో ఉంటాం. ప్రభుత్వం కూలిపోతే ప్రతిపక్షంలో కూర్చొంటాం’ అని అన్నారు. అయితే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఆ స్టేజ్కి పరిస్థితి దిగజారితే, అప్పుడు దాని గురించి మాట్లాడతామని అన్నారు.
మరోవైపు శివసేన పార్టీలో గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిశితంగా పరిశీలిస్తున్నారని జయంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వం స్థిరంగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆయన తమకు చెప్పారన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు తాము మద్దతిస్తామని అన్నారు. ఎన్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరుగుతుందని వెల్లడించారు.