న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేని గోధుమల ఎగుమతిని నిలిపివేసింది. అయితే ముందస్తు ఒప్పందాల వరకు ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం విధించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్తోపాటు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తులపై ఎండల ప్రభావం, ఆహార భద్రత వంటి కారణాలతో గోధుమల ఎగుమతిని నిషేధించింది.
మరోవైపు ప్రపంచంలో రెండో పెద్ద గోధుమ ఉత్పత్తి దేశమైన భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీ 7 దేశాలు విమర్శించాయి. ఆ దేశాల వ్యవసాయ మంత్రులు జర్మనీలోని స్టట్గార్ట్లో శనివారం సమావేశమయ్యారు. రొటీన్ పద్ధతిలో నేతృత్వం వహిస్తున్న జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ భారత్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రతి ఒక్కరూ ఎగుమతులపై పరిమితులు విధించడం లేదా మార్కెట్లను మూసివేయడం ప్రారంభిస్తే ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల సుమారు 20 మిలియన్ టన్నుల గోధుమ ఆ దేశంలోని పలు పోర్టుల్లో నిలిచిపోయాయని జీ 7 పారిశ్రామిక దేశాల వ్యవసాయ మంత్రులు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి, మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచే విధంగా నిర్బంధ చర్యలు తీసుకోవద్దని ప్రపంచ దేశాలను కోరారు. ఎగుమతులను నిలిపివేయవద్దని, మార్కెట్లను తెరిచి ఉంచాలని పిలుపునిచ్చారు.
జీ 20 సభ్యునిగా భారత్ తన బాధ్యతను నిర్వహించాలని జీ 7 వ్యవసాయ మంత్రులు కోరారు. జూన్లో జర్మనీలో జరిగే జీ 7 శిఖరాగ్ర సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించాలని సిఫార్సు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా జీ 7 శిఖరాగ్ర సదస్సుకు జర్మనీ ఇప్పటికే ఆహ్వానించింది.