నిజాంసాగర్ : దళిత బంధు పథకం ద్వారా దళితులు బాగుపడితే ముందుగా సంతోషించేది ముఖ్యమంత్రి కేసీఆరేనని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. నిజాంసాగర్ మండలాన్ని దళితబంధులో పైలెట్ మండలంగా ఎంపిక చేయడంతో బుధవారం మండలంలోని గోర్గల్ గ్రామంలో ఎమ్మెల్యే హన్మంత్షిండే, ఉమ్మడిజిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు మొట్టమొదటి సారిగా దళిత కాలనీల్లో పర్యటించారు. వారికి దళితులు ఘనస్వాగతం పలికారు. కొంత మంది ఇళ్లలోకి వెళ్లి ప్రభుత్వం అందించే పది లక్షల రూపాయలతో ఏం చేయాలనుకుంటున్నారు అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులను సద్వినియోగం చేసుకునేలా వ్యాపారాలు చేయాలని సూచించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇతర సామాజిక కుటుంబాలతో సమానంగా తలెత్తుకునేలా ప్రతీ దళితుడు బతికేలా దళిత బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. దళితబంధు ప్రకటించినందుకు సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. దళితబంధు పథకంతో పాటు దళితకాలనీల్లో మౌలిక వసతులు కూడా కల్పిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో క్లస్టర్ ప్రత్యేకాధికారి జగన్నథచారి, మండల ప్రత్యేకాధికారి సంజీవ్రావ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు విఠల్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేశ్గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్లు నర్సింహరెడ్డి, వాజిద్అలీ, సర్పంచ్లు అంబవ్వ, కమ్మరికత్తఅంజయ్య, సంగమేశ్వర్గౌడ్, లక్ష్మినారాయణ, నాయకులు తదితరులు ఉన్నారు.