జైపూర్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆ ధైర్యం ఉందా? అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. దమ్ముంటే శ్రీరామ నవమి నాడు ఏడు రాష్ట్రాల్లో జరిగిన అల్లర్లపై దర్యాప్తునకు కమిటీ వేయాలని సవాల్ విసిరారు. అప్పుడే ఈ అల్లర్ల వెనక కారణం ఏమిటన్నది తెలుస్తుందని అన్నారు. అలాగే ఈ దర్యాప్తు అనంతరం భవిష్యత్తులో మరెక్కడా కూడా అల్లర్లు జరుగవని వ్యాఖ్యానించారు. రాజస్థాన్లోని కరౌలి, జోధ్పూర్లో జరిగిన హింసాకాండపై సీఎం అశోక్ గెహ్లాట్ మీడియాతో గురువారం మాట్లాడారు. హిందూ సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్ 2న కరౌలిలో జరిగిన అల్లర్లు ‘ల్యాబరేటరీ ఎక్స్పెర్మెంట్’ అని అన్నారు. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ ఎలాంటి అల్లర్లకు తాము తావివ్వలేదని చెప్పారు.
మరోవైపు కరౌలి రీతిలో శ్రీరామ నవమి నాడు ఏడు రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయని అశోక్ గెహ్లాట్ తెలిపారు. అమిత్ షాకు ధైర్యం ఉంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీ నేతృత్వంలోని కమిటీతో ఈ అల్లర్లకు మూల కారణంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడు అంతా తేలిపోతుందని, భవిష్యత్తులో ఇలాంటి అల్లర్లు జరగవని అన్నారు.
కాగా, రాజస్థాన్లో వరుస అల్లర్లకు బీజేపీనే కారణమని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో రాష్ట్రంలో అల్లర్లను రాజేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. మతం, కులం పేరుతో రాజకీయాలు ప్రమాదకరమని, దేశానికి ఎలాంటి లబ్ధి చేకూర్చవని అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయన్నారు.