సిరిసిల్ల రూరల్ : విగ్రహాల దొంగను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక గాంధీనగర్ హన్మాన్ దేవాలయంలో గత నెల 30న దొంగలు ఆరు పంచలోహ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తి అపహరించగా.. 48 గంటల్లోనే కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పోలీస్స్టేషన్లో నిందితులను గురువారం మీడియా ఎదుట హాజరుపరిచారు. సిరిసిల్ల పట్టణ సీఐ అనిల్ కుమార్ వివరాలు వెల్లడించారు.
గజ్వేల్కు చెందిన హర్భజన్ సింగ్ అలియాస్ బజ్జీ ఆలయంలో ఆరు విగ్రహాలు చోరీ చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితున్ని గుర్తించి, 48 గంటల్లోనే పట్టుకున్నట్లు చెప్పారు. ఆరు విగ్రహాల్లో మూడు పగులగొట్టి తంగళ్లపల్లికి చెందిన సర్వోజు బాలయ్యకు విక్రయించాడు. నిందితుడు హర్భజన్ సింగ్తో పాటు విగ్రహాలు కొనుగోలు చేసిన బాలయ్యను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ సుధాకర్, క్రైమ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుళ్లు పుల్కం శ్రీనివాస్, జగదీశ్ను సీఐ అభినందించారు. పట్టణంలో చోరీలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.